NTV Telugu Site icon

Dotted Lands: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం.. చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం

Cm Jagan

Cm Jagan

Dotted Lands: చుక్కల భూముల చిక్కులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ..చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం, రైతన్నలకు ఇక నిశ్చింత… సర్వ హక్కులూ వారికే ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్‌..

ఇక, చుక్కల భూముల నేపథ్యానికి వస్తే.. బ్రిటీష్‌ వారి కాలంలో సుమారు వంద సంవత్సరాల క్రితం భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి‘ లేదా ‘ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. సదరు భూములే ‘చుక్కల భూములు‘.. దీని వల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా రైతులు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి ఉంది.. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం చూపుతోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌.

సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో దాదాపు లక్ష మంది రైతన్నల కుటుంబాలకు రూ.20,000 కోట్ల లబ్ధి పొందనున్నారు.. సంవత్సరాల తరబడి తమ స్వాధీనంలో ఉండి కూడా ఏ అవసరాలకు (క్రయవిక్రయాలు, రుణం, తనఖా, వారసత్వం, బహుమతి మొదలగు) వాడుకోలేని దుస్థితి నుంచి వారి వారి భూములకు వారిని పూర్తి హక్కుదారులను చేస్తూ.. సుమారు 97,471 కుటుంబాలకు దాదాపు రూ. 20,000 కోట్ల మేర లబ్ది చేకూర్చనున్నారు వైఎస్‌ జగన్‌. దీని కోసం సర్వ హక్కులు కూడా లభించేలా నిషేధిత భూముల జాబితా నుండి 2,06,171 ఎకరాల భూమిని తొలగించారు.. పేదలకు మేలు చేస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు.

వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికే సుమారు 22,000 మంది పేద రైతన్నలకు మేలు జరిగేలా నిషేధిత భూముల జాబితా నుండి సుమారు 35,000 ఎకరాల ‘‘షరతులు గల పట్టా భూముల‘ తొలగించారు.. దేశంలోనే మొదటి సారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వందేళ్ల తర్వాత చేపట్టిన ‘‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష‘ ద్వారా ఇప్పటివరకు 2000 గ్రామాల్లో 7,92,238 కి పైగా భూహక్కు పత్రాలు రైతులకు అందజేత.. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కరించాలనే దృక్పథంతో డిసెంబర్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,584 గ్రామాలు, పట్టణాల్లో భూముల రీసర్వే. పూర్తి… శాశ్వత భూహక్కుపత్రాల జారీ చేస్తున్నారు.. ఇప్పటికే దాదాపు 1,27,313 మంది గిరిజనులకు సుమారు 2.83 లక్షల ఎకరాల అటవీ హక్కుపత్రాల పంపిణీ.. పేద గిరిజనులందరికీ కనీసం రెండు ఎకరాల భూమి కేటాయింపు.. కుటుంబములోని అక్కచెల్లెమ్మల పేరున పత్రాలు జారీ చేశారు.. దాదాపు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇళ్లు కూడా నిర్మిస్తుంది వైసీపీ సర్కార్‌.