NTV Telugu Site icon

CM YS Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పరట్యన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Cm

Cm

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్.. ఈ పర్యటనలో డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న సీఎం.. పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.. పలాస పర్యటన కోసం ఈ రోజు ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు.. ముందుగా కంచిలి మండలం మకరాంపురంలో డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.. ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఆ బహిరంగ సభతో సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగియనుండగా.. సాయంత్రం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

ఇక, సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
* ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి తన ఇంటి నుంచి బయలుదేరి రోడ్డు మార్గం గుండా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు 8.20 గంటలకు చేరుకుంటారు.
* గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి 8.20 గంటలకు బయల్దేరి విమానంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో 9.30 గంటలకు ల్యాండ్ అవుతారు.
* విశాఖ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి ఉదయం 10.35 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
* ఉదయం 10. 35 గంటల నుంచి 10. 45 వరకు ప్రజల నుంచి స్థానిక సమస్యలపై వినతులు స్వీకరిస్తారు.
* అనంతరం మార్కాపురంలో వైఎస్సార్ సుజల ధారలో ఏర్పాటుచేసిన పంపింగ్ స్టేషన్ లో వైఎస్సార్ సుజలధార పథకాన్ని ప్రారంభిస్తారు.
* అనంతరం హెలికాప్టర్ లో పలాస బయల్దేరి ఉదయం 11.30 గంటలకు అక్కడి చేరుకుంటారు.
* పలాసలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40కు పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు.
* ఉదయం 11.40 నుంచి 11.55 నిమిషాల మధ్యలో కిడ్నీ పరిశోధన కేంద్రం ప్రారంభించి రోడ్డు మార్గంలో పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు.
* మధ్యాహ్నం 12.50 నుంచి 1.25 నిమిషాల మధ్యలో స్టాల్స్ సందర్శించి బహిరంగ సభలో మాట్లాడతారు.
* మధ్యాహ్నం 1.35 నుంచి 2.35 వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు.
* మధ్యాహ్నం 2.40 హెలికాప్టర్ లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు
* సీఎం పర్యటన దృష్ట్యా.. 2400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించేందుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.74.24 కోట్లు వెచ్చించింది. 200 పడకల ఆసుపత్రిలో రోగులకు డయాలసిస్ మరియు ఇతర వైద్య సదుపాయాలు ఉన్నాయి, ప్రస్తుతం చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ICMR) ఈ ప్రాంతంలోని దాదాపు 700 గ్రామాలలో ప్రబలంగా ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిపై పరిశోధనకు మద్దతు ఇస్తుంది. వంశధార జలాశయం నుంచి సురక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం నీటి ప్రాజెక్టును కూడా నిర్మించింది.