Site icon NTV Telugu

AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!

Ap Cabinet Meeting

Ap Cabinet Meeting

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపు, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రానున్నాయి.

ఈ సమావేశంలో సీఆర్డీఏ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం కోసం 80 సెంట్ల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి మూడు ఎకరాల భూమిని కేటాయించే అంశం కూడా క్యాబినెట్ పరిశీలనకు రానుంది. ఇక పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ఏపీఎస్ఐఆర్డీకి ఐదు ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.

Also Read: Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. నేడే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు!

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్ల వ్యయానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అలాగే రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశముంది. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావం, గ్యాస్ నిల్వలు సహా ఇతర ముఖ్య అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Exit mobile version