AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య ధీమాను కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలు అయ్యేలా నిర్ణయించింది.. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించింది..
Read Also: Janhvi Kapoor: జాన్వీపై అపార్థం తొలగించిన పవిత్రా మేనన్..
ఇక, 2493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రీడ్ విధానం అమలు చేయనున్నారు.. మొత్తం 3,257 చికిత్సలను హైబ్రీడ్ విధానంలో ఉచితంగా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.. కేవలం ఆరు గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనుంది.. రూ.2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్ ఇన్సూరెన్సు కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం ఉంటుంది.. రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వ్యయాన్ని భరించనుంది ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్.. 1.43 కోట్ల మంది పేద కుటుంబాలు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకూ వర్తించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రీడ్ విధానం రూపొందించింది.. కొత్త వైద్య కళాశాలల విషయంలోను కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్.. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదాన్ని తెలిపింది.. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్దతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనుంది.. ఈ మేరకు ఆర్ఎఫ్ పీ జారీ చేసేందుకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర మంత్రివర్గం, రెండో దశలో మిగిలిన ఆరు ప్రాంతాల్లోని వైద్య కళాశాలలను పీపీపీ కింద ఏర్పాటు చేసేందుకు ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేయాలని ఏపీ కేబినెట్ పేర్కొంది..
