AP Budget: ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 2026- 27 ఆర్థిక బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. సుమారు 3.48 లక్షల కోట్ల రూపాయలు మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఇక, ఉదయం 11.15 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. అలాగే, శాసన మండలిలో ఆర్థిక బడ్జెట్ ను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రవేశ పెట్టనున్నారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టనుండగా.. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశ పెట్టనున్నారు.
Read Also: Pargi Municipal : పరిగి మున్సిపాలిటీలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే ఇంటికి భారీగా పోలీసులు..!
అయితే, మూడోసారి బడ్జెట్ ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒకసారి, పూర్తి స్థాయిలో ఒకసారి బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కసరత్తు పూర్తి చేసిన పయ్యావుల.. ఇవాళ ఉదయం 11:15 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. అభివృద్ధి- సంక్షేమం సమ తూకంతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు లబ్ది కలిగేలా బడ్జెట్ రూపొందించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి 10 రోజుల ముందు నుంచి ప్రీ-బడ్జెటరీ సమావేశాలను ఆయన నిర్వహించారు. వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శుల నుంచి ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయ పద్దతులకు భిన్నంగా 2026-27 బడ్జెట్ ఉంటుందని ఏపీ ఆర్థిక శాఖ చెప్తుంది.
