NTV Telugu Site icon

NIA Raids: ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

Nia Searches]

Nia Searches]

NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లోని ఆరు రాష్ట్రాల్లోని 100కి పైగా సోదాలు నిర్వహించింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్‌లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ దాడులు చేపట్టింది. రాష్ట్ర పోలీసు బలగాలతో సన్నిహిత సమన్వయంతో ఉగ్రవాద నిరోధక సంస్థ బుధవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాలు, అనుమానితులతో సంబంధం ఉన్న ఇతర ప్రదేశాలలో ఈ దాడులు నిర్వహించింది. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. గత ఏడాది ఎన్‌ఐఏ దాఖలు చేసిన మూడు వేర్వేరు కేసులకు సంబంధించి ఈ దాడులు నిర్వహించబడుతున్నాయి.

2022 మేలో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై ఆర్‌పీజీ దాడిలో ప్రధాన షూటర్ దీపక్ రంగా అనే వ్యక్తిని ఈ ఏడాది జనవరి 25న ఏజెన్సీ ఓ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అరెస్టు చేసింది. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ సంధు అలియాస్ లాండాకు, పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్-టెర్రరిస్ట్ హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాకు సన్నిహితుడు. మేలో ఆర్పీజీ దాడిలో ప్రమేయంతో పాటు, దీపక్ హింసాత్మక హత్యలతో సహా అనేక ఇతర హింసాత్మక ఉగ్రవాద, క్రిమినల్ నేరాలలో పాల్గొన్నాడు. అతను రిండా, లాండా నుంచి తీవ్రవాద నిధులు, లాజిస్టికల్ మద్దతును చురుకుగా పొందుతున్నాడు.

Read Also: Trimbakeshwar Temple: త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు అరెస్ట్

2022 సెప్టెంబర్ 20న ఎన్‌ఐఏ సుమోటోగా కేసు నమోదు చేసింది. విదేశాల్లోని ఉగ్రవాద సంస్థలు దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగ్‌ల నాయకులు, సభ్యులతో కలిసి లక్ష్యంగా హత్యలు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాయని తేలింది. టెర్రర్-గ్యాంగ్‌స్టర్-డ్రగ్ స్మగ్లర్ నెట్‌వర్క్ ఆయుధాలు, మందుగుండు పేలుడు పదార్థాలు, ఐఈడీలు మొదలైన టెర్రరిస్ట్ హార్డ్‌వేర్‌లను సరిహద్దుల గుండా అంతర్-రాష్ట్ర నెట్‌వర్క్ ద్వారా అక్రమ రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు కూడా బయటపడింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్‌లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో మూడు క్రిమినల్ కేసులను నమోదు చేసినప్పటి నుంచి ఎన్‌ఐఏ 19 మందిని అరెస్ట్‌ చేసింది. కెనడాకు చెందిన అర్ష్ డల్లాను ఈ ఏడాది జనవరి 9న హోం మంత్రిత్వ శాఖ ‘వ్యక్తిగత ఉగ్రవాది’గా ప్రకటించింది.