తన అద్భుతమైన నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరించి ఎన్నో సూపర్ సినిమాలలో నటించి మెప్పించిన నటి నిత్యా మీనన్. కొంత కాలంగా సినిమాలు కాస్త తగ్గించిన నిత్యా ఇప్పుడు మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. కేవలం నటిగానే కాకుండా, తన అభిరుచికి తగ్గ కథలను వెండితెరకు పరిచయం చేసేందుకు ఆమె నిర్మాతగా మారింది. గడచిన మంగళవారం తన సొంత నిర్మాణ సంస్థ ‘కీయురి ప్రొడక్షన్స్’ (Keyuri Productions) లోగో వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు.
Also Read : Vishwak Sen : మరొక ఫ్లాప్ దర్శకుడితో విశ్వక్ సేన్..
ఈ సందర్భంగా నిత్యా మీనన్ ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. “నాకు సినిమాలు తీయడమంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదు.. అది చూసేవారిలో, చేసేవారిలో ఒక మార్పును తీసుకురావాలి. నటిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి ఇదే నా లక్ష్యం. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే బాధ్యతను కొనసాగిస్తాను” అని ఆమె తెలిపారు. ‘కీయురి’ అంటే భూమి గుహల నుంచి పుట్టి, కాంతిని ప్రేమించే ఒక రూపం లేని శక్తి అని ఆమె వీడియోలో వివరించారు. నిర్మాతగా మారిన ఈ శుభ సందర్భంలో, తన తొలి తెలుగు చిత్రం ‘అలా మొదలైంది’ విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న జ్ఞాపకాలను నిత్యా గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఒక చిన్న సినిమాగా మొదలైన ఆ ప్రయాణం తన జీవితాన్నే మార్చేసిందని ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతానికి కీయురి ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రకటించలేదు. నిత్యా మీనన్ ప్రస్తుతం తాను ఒప్పుకున్న నటన సంబంధిత ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత, తన బ్యానర్లో వైవిధ్యమైన సినిమాలను పట్టాలెక్కించనున్నారు.