బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న రిలీజ్ అయి బ్లాక్బాస్టర్ హిట్ అయింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఈ మూవీ సుమారు రూ.900కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ హిట్ అయింది. ఈ మూవీ పై మొదట్లో విమర్శలు వచ్చినా కూడా కమర్షియల్గా మాత్రం భారీ విజయం సాధించింది. ఇక.. యానిమల్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కోర్టులో కేసు నడుస్తుండడం ఇందుకు కారణంగా ఉంది. యానిమల్ సినిమాను నిర్మించిన టీ-సిరీస్, ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్పై ఈ మూవీకి సహ నిర్మాతగా ఉన్న సినీ వన్ స్టూడియోస్ కోర్టులో కేసు వేసింది. తమకు టీ-సిరీస్ బకాయిలను చెల్లించలేదని, అందుకే యానిమల్ ఓటీటీ రిలీజ్ను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం నేడు టీ-సిరీస్తో పాటు నెట్ఫ్లిక్స్కు నోటీసులు జారీ చేసింది.నోటీసులు అందడంతో టీ-సిరీస్ మరియు నెట్ఫ్లిక్స్ కోర్టుకు అఫిడవిట్స్ సమర్పించాల్సి ఉంది. తదుపరి విచారణను జనవరి 22వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.యానిమల్ మూవీ లాభాల్లో తమకు ఒక్క రూపాయి కూడా టీ-సిరీస్ చెల్లించలేదని సినీ వన్ స్టూడియోస్ కోర్టుకు తెలిపింది. రూ.2.6 కోట్లు ఇచ్చినట్టు టీ-సిరీస్ తరఫున న్యాయవాది తెలిపినా.. అందుకు తగిన ఆధారాలను అయితే చూపలేదు.యానిమల్ సినిమాను జనవరి 26వ తేదీన స్ట్రీమింగ్కు తీసుకురావాలని నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ భావించింది.కానీ ఇప్పుడు ఈ విషయం కోర్టు విచారణపై ఆధారపడి ఉంది. జనవరి 22వ తేదీన ఈ కేసు ఓ కొలిక్కి రాకపోతే యానిమల్ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం వున్నట్లు సమాచారం.ఒకవేళ ఈ కోర్ట్ కేసు క్లియర్ అయితే యానిమల్ మూవీ అనుకున్న సమయానికి ఓటీటీ రిలీజ్ కానుంది.