Amaravati Seed Access Road: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అనుసంధానించే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్తో పాటు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాయపూడి నుంచి ఉండవల్లి వరకు రహదారి
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రాయపూడి నుంచి వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి వరకు పనులు పూర్తయ్యాయి. రాజధాని ప్రాంతంలోని పలు ముఖ్య ప్రాంతాలను అనుసంధానించే ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ప్రజలకు, వాహనదారులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఇక, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని మొత్తం రూ.1,519 కోట్ల వ్యయంతో చేపట్టారు. రాజధాని ప్రాంతంలో మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తవడంతో రాజధాని నగరానికి మరింత మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది.
జాతీయ రహదారి-16కు అనుసంధానం
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని దశలవారీగా విస్తరించే ప్రణాళిక ఉంది. మూడో దశలో మణిపాల్ వద్ద జాతీయ రహదారి-16కు అనుసంధానించేలా రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో అమరావతికి జాతీయ రహదారి నెట్వర్క్తో మరింత మెరుగైన కనెక్టివిటీ ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ బ్రిడ్జిలను కాలినడకన పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి, బ్రిడ్జి నిర్మాణంతో రాజధాని ప్రాంతంలో వాహన రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఇక పూర్తి స్థాయిలో వాహన రాకపోకలు
సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో నేటి నుంచి ఈ మార్గంలో పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు మార్గం సుగమమైంది. రాజధాని ప్రాంతానికి వచ్చే ప్రజలు, స్థానికులు, వాహనదారులకు ఈ రహదారి కీలకంగా మారనుంది. ప్రారంభ కార్యక్రమానికి రైతులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

