Amaravati Quantum Valley: సాంకేతిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది ఆంధ్రప్రదేశ్.. ప్రపంచ క్వాంటం డే పురస్కరించుకుని ఓ కీలక ఘట్టానికి రాష్ట్రం వేదిక కానుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా ఈ రోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్ లో రెండు వేర్వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ శకంలో నూతన అధ్యాయానికి నాంది పడనుంది. గన్నవరంలోని మేధా టవర్స్ తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు అవుతున్న 1ఎస్, 1 క్యూ పేరిట రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటం రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి రానుంది.
Read Also: Praful Hinge-Vaibhav: హాట్సాఫ్ ప్రఫుల్ హింగే.. చెప్పినట్టే మొదటి బంతికే ‘బుడ్డోడి’ వికెట్ తీశావ్!
మేధాటవర్స్ లో క్యూబిటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లు ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ టెస్ట్ బెడ్ లు క్వాంటం హార్డ్ వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ లు క్వాంటం ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటం కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్ధులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లో 1 ఎస్ పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటం టెస్ట్ బెడ్ ను నిర్మించారు. ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ లాంటి సంస్థలు సహకారం అందించాయి. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ సహా, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్ ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరు కానున్నారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్ గా దాదాపు 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు…
మొత్తంగా నేడు వరల్డ్ క్వాంటం డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్న కీలక కార్యక్రమం జరగనుంది. దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్ బెడ్ను అమరావతిలోని SRM University AP లో ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర సాంకేతిక అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం పేర్కొంది. క్వాంటం టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో డేటా భద్రత, వేగవంతమైన కంప్యూటింగ్, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. ఈ క్వాంటం టెస్ట్ బెడ్ ద్వారా స్టార్టప్ సంస్థలు, పరిశోధన సంస్థలు, టెక్నాలజీ రంగ నిపుణులకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి. కొత్త ఆవిష్కరణలకు ఇది వేదికగా మారడంతో పాటు దేశంలో క్వాంటం పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఎదగనున్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
యువతకు అధునాతన సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. భారత టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుండటం విశేషం. నేటి కార్యక్రమంతో రాష్ట్రం సాంకేతిక విప్లవ దిశగా మరో కీలక అడుగు వేయనుంది.