Bengal Election: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో సరికొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIM, హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ‘జనతా ఉన్నయన్ పార్టీ’ చేతులు కలపడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా మాల్డా, ముర్షిదాబాద్, బీర్బూమ్ వంటి ముస్లిం ప్రాబల్యం ఉన్న జిల్లాలపై ఈ కూటమి కన్నేసింది. ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో కూటమి ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో ఆసక్తికరంగా మారింది.
READ ALSO: BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..
బీహార్ ఫార్ములాతో బెంగాల్ బరిలోకి..
గత బీహార్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేసి 5 సీట్లు గెలుచుకున్న వ్యూహాన్నే బెంగాల్లోనూ అమలు చేయాలని ఒవైసీ భావిస్తున్నారు. హుమాయూన్ కబీర్ ఈ కూటమిలో భాగంగా 50 సీట్లు ఆశించినప్పటికీ, పార్టీ మాత్రం పరిమిత స్థానాల్లోనే పోటీ చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా AIMIM ముర్షిదాబాద్, మాల్డా, బీర్బూమ్ జిల్లాల్లోని స్థానాలను టార్గెట్గా చేసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 25న అసదుద్దీన్ ఒవైసీ కోల్కతాకు చేరుకోనున్నారు. ఈ మూడు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
గ్రౌండ్ రిపోర్ట్ ఏ చెబుతోందంటే..
మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాల్లో AIMIM గత కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో పటిష్టమైన పునాదిని నిర్మించుకుంది. హుమాయూన్ కబీర్ మద్దతు తోడైతే, ఈ జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఓట్లకు గండి పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కబీర్ పార్టీ ‘జనతా ఉన్నయన్ పార్టీ’ చాలా కొత్తది కావడం, కేవలం బెల్దంగా, రెజినగర్ ప్రాంతాలకే ఆయన ప్రభావం పరిమితం కావడం కొంత మైనస్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ కూటమి వల్ల ముస్లిం ఓట్లు చీలితే అది నేరుగా మమతా బెనర్జీకి నష్టం చేకూరుస్తుందనే వాదన వినిపిస్తోంది. అయితే తృణమూల్ నేతలు దీనిని కొట్టిపారేస్తున్నారు.
గత ఎన్నికల లెక్కల (2021) లెక్కలను ఒకసారి పరిశీలిస్తే.. ముర్షిదాబాద్లో 22 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో TMC 20, బీజేపీ 2 గెలుచుకుంది. మాల్డా పరిధిలో 12 స్థానాలు స్థానాలు ఉంటే TMC 8, బీజేపీ 4 కైవసం చేసుకుంది. గతంలో టీఎంసీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఈ జిల్లాల్లో ఒవైసీ ఎంట్రీతో ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుమాయూన్ కబీర్ – ఒవైసీ జోడి దీదీ ఓటు బ్యాంకులో ఎంతవరకు చీలిక తెస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు.