అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో వాడింది కల్తీ నెయ్యేనని నిర్ధారణ అయింది. హైదరాబాద్కు పంపిన శాంపిల్స్ ల్యాబ్ పరిశీలనలో వాస్తవాలు వెల్లడయ్యాయి. దాంతో ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో నాణ్యతలేని వెయ్యి వాడుతున్నట్లు తేలిపోయింది. గత నెల ఆహార భద్రత అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో లూజు నెయ్యి ప్యాకెట్లు, బ్రాండ్ లేని నెయ్యి నమూనాలను గుర్తించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించాలన్న అత్యాశలతో కొందరు నాణ్యత లేని నెయ్యి వాడుతున్నట్లు అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు.
ఫిబ్రవరి 17న ఆహార తనిఖీ అధికారులు నాలుగు బృందాలుగా చేసిన తనికీల్లో ఆత్రేయపురం పూతరేకులు దుకాణాల్లో ముద్రితం లేని 160 కిలోల నెయ్యి స్వాధీవం చేసుకున్నారు. అనుమానం రావడంతో పలుచోట్ల 8 నమూనాలు సేకరించారు. వీటిని పరీక్ష కోసం హైదరాబాద్లోని ప్రయోగశాలకు పంపారు. ఈ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఇందులో మూడు నమూనాల్లో కల్తీ జరిగినట్లు ల్యాబ్ పరీక్షల్లో గుర్తించారు. ఈ మేరకు ఆహర భద్రత అధికారి బి.శ్రీనివాస్ కల్తీ నెయ్యి వినియోగిస్తున్న పూతరేకుల దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. ఇకపై నెయ్యి తయారీ తేదీ లేకపోయినా, లైసెన్స్ లేకుండా దుకాణాలు నడిపినా కేసులు నమోదు చేస్తామని ఆహార భద్రత అధికారులు హెచ్చరించారు.