టాలీవుడ్ మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అయితే, ఈ సక్సెస్ సమయంలోనే సీనియర్ కమెడియన్ గీతా సింగ్ అనిల్ రావిపూడి టీమ్పై చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో రవితేజ హీరోగా వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా కోసం తనను సంప్రదించి, ఆ తర్వాత కనీసం సమాచారం ఇవ్వకుండానే వేరే నటిని తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!
దాదాపు నెల రోజుల పాటు డేట్స్ అడిగి, తీరా షూటింగ్ సమయానికి తనను పక్కన పెట్టడం తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. గీతా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ పక్కన ఉండే ఒక కీలక పాత్ర కోసం అనిల్ రావిపూడి కో-డైరెక్టర్లు తనను సంప్రదించారట. అవుట్డోర్ షూటింగ్ ఉంటుందని చెప్పడంతో ఆమె తన ఇతర ప్రాజెక్టులను కూడా రద్దు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత టీమ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదట. చివరికి సినిమా విడుదలయ్యాక థియేటర్లో ఆ పాత్రను మరో అమ్మాయి చేయడమే కాకుండా, తను వదులుకున్న సీన్లను చూసి చాలా బాధపడ్డానని గీత ఎమోషనల్ అయ్యారు. చిన్న ఆర్టిస్టుల విషయంలో ఇలాంటి వైఖరి సరికాదని, ఒక అవకాశం వస్తుందని ఆశపడి ఎదురుచూసే వారి జీవితాలతో ఆడుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గీతా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై అనిల్ రావిపూడి టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.