NTV Telugu Site icon

Kidnap Drama: లక్ష రూపాయలను ఎగ్గొట్టడానికి యువకుడు కిడ్నాప్ డ్రామా.. చివరకు..

Kidnap

Kidnap

Kidnap Drama: అప్పుగా తీసుకున్న లక్ష రూపాయలు ఎగ్గొట్టేందుకు యువకుడు ఆడిన కిడ్నాప్‌ డ్రామాకు బాలాపూర్ పోలీసులు తెరదించారు. లక్ష రూపాయలను ఎగ్గొట్టేందుకు పెదనాన్నను మోసం చేయబోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడ సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న రమేష్​ (40) వృత్తి రీత్యా లేబర్​. అదే కాలనీకి చెందిన వృత్తి రీత్యా లేబర్​ అయిన అతన పెదనాన్న వద్ద అతను మూడేళ్ల క్రితం లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా తీసుకున్న ఆ డబ్బులు తిరిగివ్వాలని అతని పెదనాన్న రమేష్‌పై ఒత్తిడి చేయసాగాడు. దీంతో పెదనాన్న కుటుంబంపై రమేష్​ కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా పెదనాన్నను, అతని కొడుకుని పోలీసు కేసులో ఇరికిస్తే లక్షరూపాయలు ఎగొట్టవచ్చని పథకాన్ని రచించాడు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం సమయంలో రమేష్​ ఆటోలో దేవతల గుట్ట సమీపంలోని ఆర్​సీఐ మెయిన్​ రోడ్​ వద్ద దిగాడు. అక్కడ కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వైర్లతో ముందుగా కాళ్ళను గట్టిగా కట్టేసుకున్నాడు. అనంతరం చేతులు వెనకకు పెట్టుకుని ఒక చేతికి వైర్‌ను గట్టిగా, మరో చేతికి కాస్త లూజుగా కట్టుకున్నాడు. నోట్లో పెట్టీపెట్టనట్టు గుడ్డను పెట్టుకుని కింద పడి పెనుగులాడడం, గట్టిగా ములగడం ప్రారంభించాడు. అటుగా వచ్చిన అయోధ్యనగర్‌కు చెందిన కళ్యాణ్ బాలాపూర్​ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతని కాళ్లకు, చేతులకు ఉన్న వైర్లను తొలగించారు. తనను పెదనాన్న కుమారుడు సురేష్​ పని ఇప్పిస్తానని ఇక్కడికి తీసుకువచ్చి వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదాడని, హత్య చేయబోయాడని రమేష్​ బాలాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read Also: Constable Fell Down on Road: ఫుల్‌గా మందు కొట్టి రోడ్డుపై పడిపోయిన కానిస్టేబుల్‌.. ఆస్పత్రిలో రచ్చ..

ఆ దిశగా కేసు దర్యాప్తు చేసిన బాలాపూర్​ పోలీసులకు రమేష్​ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆటోలో రమేష్​ ఒక్కడే దిగినట్లు పోలీసులు గుర్తించారు. పెదనాన్న కుమారుడు సురేష్​ కాల్‌డేటా ఆధారంగా లొకేషన్​ చెక్​ చేయగా గుంటూరులో ఉన్నట్లు నిర్దారించారు. మరోసారి అతడిని విచారించగా గుంటూరులోనే ఉన్నట్లు సురేష్​ చెప్పడంతో పోలీసులు తనదైన స్టైల్​లో రమేష్‌ను విచారించారు. పెదనాన్నకు లక్షరూపాయలు ఎగ్గొట్టడానికే ఈ ఫేక్​ కిడ్నాప్​ హత్య డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. గతంలో రమేష్​ ఓ కిడ్నాప్​ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను తప్పుదోవ పట్టించిన రమేష్‌ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.