Site icon NTV Telugu

Russia Ukraine War: పౌర కాన్వాయ్‌పై రష్యా దాడి.. 30కి చేరిన మృతుల సంఖ్య

Missile Attack

Missile Attack

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడు నెలలు దాటినా కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధతీవ్రత తగ్గడం లేదు. ఎటువైపు నుంచి ఏ రాకెట్ వచ్చిపడుతుందో అని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు వణికిపోతున్నాయి. మరోవైపు పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ పై దాడులను మరింతగా పెంచేలా ప్లాన్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ జపోరిజ్జియా ప్రాంతంలో దారుణానికి తెగబడింది రష్యా. ఓ పౌరకాన్వాయ్‌పై రష్యా దాడి చేసింది. రష్యా జరిపిన ఈ దాడిలో మొత్తం 30 మంది సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ శుక్రవారం తెలిపింది. దాదాపు 88 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని జపోరిజ్జియా ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ తెలిపారు. రష్యా దాడులకు తెగబడుతూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన నిందించారు. మరణించిన వారిలో 11 ఏళ్ల బాలిక, 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారని వెల్లడించారు.

మరోవైపు రష్యా ఇప్పటివరకు ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా రష్యాలో విలీనం చేసుకున్నట్లు శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నాలుగు ప్రాంతాలు ఉక్రెయిన్‌ భూభాగంలో 15శాతం ఉన్నాయి. క్రెమ్లిన్ వేడుకలో సెయింట్ జార్జ్ హాల్‌లో ఉక్రేనియన్ భూభాగాల విలీనాన్ని ప్రకటించిన పుతిన్ సుదీర్ఘ ప్రసంగంలో రష్యాలో నాలుగు కొత్త ప్రాంతాలు చేరాయని అన్నారు. ఉక్రెయిన్ తో ఏడు నెలల యుద్ధంలో ఆ దేశానికి చెందిన తూర్పు భాగాలను రష్యా పాక్షికంగా ఆక్రమించుకుంది. తాజాగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణతో ఉక్రెయిన్ లోని ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో అధికారికంగా విలీనం అయ్యాయి.

5G Services Launch: 5జీ సేవలకు నేడే శ్రీకారం.. అధికారికంగా ప్రారంభించనున్న ప్రధాని

మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో పట్టుకోల్పోతున్న రష్యా..మరింతగా దాడులు చేసేందుకు పాక్షిక సైనిక సమీకరణ చేయాలని ఇటీవల డిక్రీ జారీ చేశారు. రాబోయే రోజుల్లో యుద్దంలో 3 లక్షల మంది సైన్యాన్ని సమీకరించేందుకు సిద్ధం అయ్యారు. దీంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కీవ్ వంటి ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఉక్రెయిన్ కు నాటో ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంతో రష్యాకు ఎదురొడ్డి నిలబడుతోంది. దీంతో రష్యా నెమ్మదిగా ఉక్రెయిన్ పై పట్టు కోల్పోతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా పాక్షిక సైనిక సమీకరణ చేయడంతో పాటు అవసరం అనుకుంటే అణుబాంబులు వేసేందుకు సిద్ధంగా ఉందని పుతిన్ నాటో, అమెరికా, వెస్ట్రన్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version