హమ్మయ్య.. హార్ముజ్ జలసంధి నుంచి పెద్ద ఎత్తున భారతీయ చమురు నౌకలు తరలి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం కమ్ముకున్న వేళ భారతదేశానికి ఇరాన్ పచ్చజెండా ఊపింది. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన దౌత్యం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇరాన్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అగ్ర నేతలుగా ఉన్న ప్రముఖులతో జైశంకర్ చర్చలు జరిపారు. తాజాగా ఆ దౌత్యం సత్ ఫలితాన్ని ఇచ్చింది. హార్ముజ్ జలసంధిలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్న తరుణంలో భారతదేశానికి చెందిన నౌకలు సాఫీగా వెళ్లేందుకు ఇరాన్ అన్ని విధాలుగా రూట్ క్లియర్ చేసింది. దీంతో ప్రస్తుతం 28 భారతీయ నౌకలు బయల్దేరాయి. దాదాపు 778 మంది నావికులు తిరిగి భారత్కు రానున్నారు. ఇప్పటికే రెండు నౌకలు ముంబైకి చేరుకున్నాయి.

28 భారతీయ నౌకలు పెర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోయాయి. అందులో 778 మంది నావికులు ఉన్నారు. తాజాగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. నౌకల్లో ఇరవై నాలుగు హార్ముజ్ జలసంధి పశ్చిమ భాగంలో ఉండగా.. నాలుగు తూర్పు భాగంలో ఉన్నట్లు తెలుస్తోంది. 778 మంది నావికులతో కూడిన 28 భారతీయ నౌకలు పర్షియన్ గల్ఫ్లో చిక్కుకున్నాయని ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు.
మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా తలెత్తిన చమురు, గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో పాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఫోన్ కాల్ సంభాషణ చేశారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై చర్చించారు. అంతర్జాతీయ పెద్దలతో జరిపిన సంభాషణ సత్ఫలితాన్ని ఇచ్చాయి.
ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో శత్రు దేశాలకు వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ నిలిపివేసింది. అమెరికా, యూరప్, ఇజ్రాయెల్లకు వెళ్లే నౌకలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో భారతదేశానికి ఇరాన్ ప్రత్యేక రాయితీని మంజూరు చేసింది. మొత్తానికి జైశంకర్ జరిపిన దౌత్యం అద్భుతంగా పని చేసింది.