బెంగళూరులో నీటి ఎద్దడి కొందరికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా తాగు నీటి కోసం బెంగళూరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. బోర్లు అడుగంటి పోవడం, కాలువలు, చెరువులు ఎండిపోవడం.. ఇలా ఒకదాని వెంట ఒకటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాగునీరు వృథా చేయొద్దని కొద్ది రోజులుగా హెచ్చరిస్తూనే వస్తున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. తాజాగా తాగునీరు అనవసరమైన పనులకు వినియోగించిన కుటుంబాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
నీటి వృథాపై సోషల్ మీడియా ప్లాట్ఫాం వేదికగా ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 22 కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. నీటి కొరత నేపథ్యంలో తాగునీరు సంరక్షణకు తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు తెలిపింది. తాగునీటిని కార్ వాషింగ్ లేదా గార్డెన్ అవసరాలకు వాడినందుకు గాను నగరంలోని వివిధ ప్రాంతాల్లో 22 కుటుంబాల నుంచి మొత్తం రూ.1.1 లక్షల మేర జరిమానాగా వసూలు చేసినట్లు వెల్లడించింది. దక్షిణ ప్రాంతం నుంచే అత్యధికంగా రూ.80 వేలు జరిమానా వసూలు చేసినట్లు పేర్కొంది.
బెంగళూరు నగరంలో నీటి కటకటను దృష్టిలోఉంచుకుని తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఇటీవల నీటి సరఫరా బోర్డు ప్రజలకు సూచించింది. వాహనాలు కడగడం, నిర్మాణాలు, వినోద సంబంధిత కార్యక్రమాల కోసం తాగునీరు వాడొద్దని కోరింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మళ్లీ ఈ చర్య పునరావృతమైతే ప్రతిసారీ రూ.500 అదనంగా జరిమానా విధించాలని నిర్ణయించింది. మరోవైపు, హోలీ వేడుకల సందర్భంగా ప్రజలు కావేరీ, బోరుబావుల నీటిని పార్టీలు, రెయిన్ డ్యాన్స్ల కోసం వినియోగించొద్దని సూచించింది. అనవసర నీటి వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా ఎయిరేటర్లు అమర్చేలా హోటళ్లు, అపార్టుమెంట్లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఓ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
గత కొద్ది రోజులుగా తాగు నీటి కొరతతో బెంగళూరు వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేక తంటాలు పడుతున్నారు. మరోవైపు కొనేందుకు నీళ్లు దొరకడం లేదు. పైగా కొందామంటే ట్యాంకర్ల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఓ వైపు ఎండకాలం.. ఇంకోవైపు నీళ్లు కొరత.. ఇలా మార్చి నెలలోనే ఇంతటి ఇబ్బందులు ఉంటే.. ఏప్రిల్, మే నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.