Pakistan: పాకిస్తాన్లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో దాడి జరిగింది. గిరిజన జిల్లాలోని సెక్యురిటీ చెక్పోస్టుపై శనివారం ఆరుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాదికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ఏడుగురు పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మృతుల్లో్ ఉన్నారు. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు.
చొరబాటు ప్రయత్నాలు విఫలమైన తర్వాత, ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో చెక్పోస్టును ఢీకొట్టారని, ఆ తర్వాత అనేక ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని పాక్ ఆర్మీ తెలిపింది. ఆ తర్వాత ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు వెల్లడించింది. లెఫ్టినెంట్ కల్నల్ సయ్యద్ కాషిఫ్ అలీ మరియు కెప్టెన్ ముహమ్మద్ అహ్మద్ బదర్ మరణించినట్లు ప్రకటన పేర్కొంది. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర ఉగ్రవాదుల్ని నిర్మూలించేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది.
Read Also: Om Bheem Bush : ‘ఓం భీం బుష్ ‘ లో మెరిసిన నలుగురు ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?
ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్సు ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ సైనికుల మరణానికి సంతాపాన్ని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. పాక్ తాలిబాన్లు, ఇతర ఉగ్ర సంస్థలు పోలీసులు, సైన్యం లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. వీరికి ఆఫ్ఘాన్లోని తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ఇక్కడి గిరిజన వజీరిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల సమాంతర పాలన నడుస్తోంది.
సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ జారీ చేసిన వార్షిక భద్రతా నివేదిక ప్రకారం, పాకిస్తాన్ 2023లో 789 తీవ్రవాద దాడులు మరియు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో 1,524 మరణించగా, 1,463 గాయపడ్డారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులు దాడులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. మొత్తం మరణాల్లో 90 శాతం, దాడుల్లో 84 శాతం ఇక్కడే జరిగాయి.