NTV Telugu Site icon

Pahalgam Attack: Z-మోర్హ్ ఘటనలో ఆరుగురు కార్మికులు, వైద్యుడిని చంపింది “పహల్గామ్” టెర్రరిస్టులే..

Pahalgam Attack

Pahalgam Attack

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. అయితే, పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులే, 2024లో జరిగిన Z-మోర్హ్ టన్నెల్ ప్రాజెక్ట్‌పై దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

2024లో జమ్మూ కాశ్మీర్‌లోన గండేర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్‌లో నిర్మితమవుతున్న Z-మోర్హ్ టన్నెల్ ప్రాజెక్టుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు కార్మికుల్ని, ఒక వైద్యుడిని చంపేశారు. ఈ దాడిని కూడా లష్కరే తోయిబా మద్దతు ఉన్న టీఆర్ఎఫ్ ఉగ్రవాదులే నిర్వహించారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న అనేక మంది ఉగ్రవాదులు గతంలో Z-మోర్హ్ టన్నెల్ దాడిలో పాల్గొన్నట్లు సంబంధిత నిఘా వర్గాలు చెబుతున్నాయి.

2024 దాడి వెనక ఉన్న ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌ని అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదుల్న కూడా భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే ఉగ్రవాది హషీమ్ ముసా, అలియాస్ సులేమాన్ టన్నెల్ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.

Read Also: CM Chandrababu : రైతుల్ని పారిశ్రామిక వేత్తలను చేస్తాం.. యువత ఆలోచనా విధానంలో మార్పు రావాలి!

Z-మోర్హ్ సొరంగం దాడి: అక్టోబర్ 2024

సోనామార్గ్ సొరంగంగా పిలువబడే Z-మోర్హ్ టన్నెల్ ప్రాజెక్టుపై అక్టోబర్‌, 2024లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కార్మిక శిబిరంలో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. వీరితో పాటు ఒక వైద్యుడిని కూడా చంపేశారు. 6.5 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం, అదనంగా 6.05 కి.మీ అప్రోచ్ రోడ్లతో, శ్రీనగర్ నుండి కార్గిల్‌ను కలుపుతుంది. ఇది 8,562 అడుగుల ఎత్తులో నిర్మితమైంది.

ఈ దాడిలో మరణించిన వారిలో బుద్గాంకు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్, మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్ (సేఫ్టీ మేనేజర్), బీహార్‌కు చెందిన కలీమ్, మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ కుమార్ శుక్లా (మెకానికల్ మేనేజర్),జమ్మూకు చెందిన డిజైనర్ శశి అబ్రోల్ ఉన్నారు. ఉగ్రవాదులు ప్రైవేట్ కంపెనీకి చెందిన రెండు వాహనాలను తగులబెట్టారు.