Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..

  • 1947 విభజనకు కాంగ్రెస్‌దే బాధ్యత..
  • మోడీ ప్రధాని అయి ఉంటే భారత్‌‌కు నష్టం జరిగేది కాదు..
  • సర్దార్ పటేల్ ప్రధానిగా ఉన్నా దేశ విభజన జరిగేది కాదు..
  • సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
Modi Yogi

Modi Yogi

Yogi Adityanath: 1947 భారత దేశ విభజన అనంతరం జరిగిన హింసకు కాంగ్రెస్‌దే బాధ్యత అని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్య్రం, దేశ విభజన నాటి పరిణామాల గురించి ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి ఉంటే భారత్‌కు ఇంత నష్టం జరిగేది కాదని ఆయన అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానిగా ఉన్నా కూడా దేశం విభజనకు గురయ్యేది కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికార దాహంతో తీసుకున్న నిర్ణయాల వల్ల దేశం భారీ మూల్యం చెల్లించిందని ఆరోపించారు.

1947 విభజన, మారణకాండకు కాంగ్రెస్‌ నిజమైన బాధ్యత అని, ఒకవేళ ఆ సమయంలో మోడీ ప్రధానిగా ఉండి ఉంటే ఎవరూ ఏమీ చేయలేకపోయేవారని అన్నారు. కాంగ్రెస్ నేతల పిరికితనం కారణంగా దేశం భారీ మూల్యం చెల్లించుకుందని ఆరోపించారు. 1947లో పాకిస్తాన్ తాను కోరని భూభాగాలను కూడా ఇచ్చారని, సింధ్ ప్రాంతాన్ని, పంజాబ్ ప్రాంతాలను విభజన సమయంలో పాకిస్తాన్‌కు అప్పగించారని ఆయన అన్నారు.

బెంగాల్‌లో హిందువులు అధికంగా ఉన్న గ్రామాలను కూడా బలవంతంగా అప్పగించారని యోగి ఆరోపించారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌పై ఉంచిన నమ్మకాన్ని ఆ పార్టీ అధికార దాహంతో వమ్ము చేసిందని విమర్శించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగిన సమయంలో కాంగ్రెస్ మౌనం వహించిందని, ఓటు బ్యాంక్ దెబ్బతింటుదనే భయంతో ఆ పార్టీ స్పందించలేదని అన్నారు. దేశంలో కులం, ప్రాంతం, భాష ఆధారంగా ఏర్పడిన అంతర్గత విభేదాలు భారత్‌ను బలహీనపరిచాయని యోగి అన్నారు. ఇలాంటి విభేదాలు ఉన్నప్పుడు కుట్రలకు అవకాశం సులభంగా దొరుకుతుందని చెప్పారు.