Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్

  • హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం..
  • భారత్‌కు ఈ వ్యాఖ్యలు ప్రమాదకరమని విమర్శ..
  • నెహ్రూ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ అన్సారీ చేసిన కామెంట్స్‌పై వివాదం..
Yogi

Yogi

Yogi Adityanath:  మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఏజీ నూరానీ స్మారక ఉపన్యాసంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన పాత వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ఏజీ నూరానీ రచించిన ‘‘ ది ఆర్ఎస్ఎస్: ఏ మెనేస్ టూ ఇండియా’’ పుస్తకాన్ని ఉటంకిస్తూ.. కమ్యూనిజం కంటే హిందూ మితవాద మతతత్వమే భారతదేశానికి ముప్పుగా నెహ్రూ పేర్కొన్నారని అన్సారీ తెలిపారు. ఇవి తన వ్యాఖ్యలు కాదని నెహ్రూ చేసిన వ్యాఖ్యలు అని అన్నారు.

అయితే, అన్సారీ వ్యాఖ్యలపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు భగ్గుమంటున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్సారీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్సారీ ప్రస్తావన సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు హిందూ సంప్రదాయాలను అవమానించడంతో పాటు హిందువులను ఉగ్రవాదంతో ముడిపెట్టే ప్రయత్నం అని యోగి ఆరోపించారు. భారతదేశ గుర్తింపు, సంస్కృతి, సంప్రదాయాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయని, దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న శక్తులకు ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగపడుతాయని ఆయన ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై ముస్లిం మతపెద్దతు కూడా విమర్శలు చేస్తున్నారు.

ఇండోర్ స్టూడెంట్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై కూడా యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీపై స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి, రాహుల్ ‌తో కలిసి చేసిన స్కిట్ వివాదంగా మారింది. ప్రజా జీవితంలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని అన్నారు. మహిళా గౌరవాన్ని గుర్తుచేస్తూ.. ‘‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా:’’ అనే సూక్తిని ప్రస్తావించారు.