యూపీ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల అభ్యర్ధులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. నేతల ఆస్తిపాస్తులు, అప్పుల వివరాలు బయటపడుతున్నాయి. యూపీ సీఎం యోగి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గోరఖ్పుర్ శాసనసభస్థానం నుంచి యోగి తన నామినేషన్ దాఖలుచేశారు.
ఇప్పటివరకు లోక్సభకు ఐదుసార్లు ఎన్నికైన ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ పత్రాలలో తన ఆస్తులు, తనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. ఆయనకు కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో కొంత నగదుతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో మరికొంత డబ్బు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు 12వేల రూపాయల విలువ కలిగిన ఓ శాంసంగ్ మొబైల్ ఫోన్, లక్ష రూపాయల విలువగల రివాల్వర్, రూ.80 వేల విలువ కలిగిన మరో రైఫిల్ ఉందన్నారు.
49 వేల విలువగల బంగారు చెవి రింగు, రూ.20వేల విలువ కలిగిన రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యూపీ సీఎం పేర్కొన్నారు. తన పేరు మీద ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని వెల్లడించారు. పెండింగ్లోనూ ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్లో యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. నాలుగేళ్లలో తన ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్లో యోగి వివరించారు. యోగి అఫిడవిట్ ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్ అవుతోంది.