NTV Telugu Site icon

S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..

S Jai Shankar

S Jai Shankar

S Jaishankar: యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనం వీడారు. యూకేకు బుద్ధి వచ్చే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు, ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా, భారత్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రాయబార కార్యాలయంపై దాడి చేసి భారత జెండాను అవమానపరిచారు.

Read Also: Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం..

ఈ ఘటనపై మాట్లాడుతూ.. భద్రతా బాధ్యతలను నెరవేర్చడంలో యూకే ప్రభుత్వ విఫలమైందని ఆరోపించారు. దౌత్యవేత్తలు తమ విధులను నిర్వర్తించడానికి, హై కమిషన్ కు భద్రత కల్పించడం ఆ దేశాల బాధ్యత కానీ యూకే ఆ బాధ్యతను నెరవేర్చలేదు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరిపాం అని జైశంకర్ అన్నారు.చాలా దేశాలు భద్రత గురించి క్యాజువల్ గా ఉంటాయి. వారు తమ సొంత భద్రత గురించి ఆలోచిస్తారు తప్పితే ఇతరుల భద్రత గురించి భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారని యూకేను ఉద్దేశించి మాస్ కామెంట్స్ చేశారు. మేము ఇలాంటి ప్రమాణాలను అంగీకరించబోమని జైశంకర్ అన్నారు.

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడి కోసం పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత వారం నుంచి అతను తప్పించుకుతిరుగుతున్నాడు. ఖలిస్తాన్ పేరుతో పంజాబ్ యువతను రెచ్చగొట్టమే కాకుండా, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు పాక్ నుంచి ఆయుధాలు పొందినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయనపై పంజాబ్ పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారంటూ కెనడా, యూకే, ఆస్త్రేలియాలోని ఖలిస్తానీ అనుకూలవాదులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం యూకేలోని భారత ఎంబసీపై దాడులు చేశారు. ఫ్రీ అమృత్ పాల్ సింగ్, వీవాంట్ జస్టిస్, వీస్టాండ్ విత్ అమృత్ పాల్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ భారత జాతీయ పతాకాన్ని అవమానపరచాలని ప్రయత్నించారు.