కొందరు కూర్చున్న వద్దనే అన్నీ రావాలి.. కనీసం అక్కడే ఉన్న టీవీ రిమోట్ తీసుకోవడానికి కూడా బద్ధకమే.. ఎక్కడో వేరేచోట పనిలో ఉన్నవారిని పిలిచి మరి పనిచేయించుకుంటారు.. అంటే వారు కదలలేని స్థితిలో ఉన్నారు అంటే అదీ కాదు.. కానీ, లేచేందుకే బద్ధకం.. ఇలా పనులను వాయిదా వేసేవారు, శరీరానికి కనీసమైన వ్యాయామం చేయకుండా.. బద్ధకించేవారు.. ఇలా ఎంతో మంది ఉన్నారు.. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన ఫిజికల్ యాక్టివిటీపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2022 ప్రకారం.. భారత్లో బద్ధకస్తుల సంఖ్య పెరిగిపోయింది.. ప్రపంచవ్యాప్తంగా 2020 – 2030 మధ్య కాలంలో దాదాపు 500 మిలియన్ల మంది గుండె జబ్బులు, స్థూలకాయం, మధుమేహం, ఇతర నాన్కమ్యూనికేబుల్ వ్యాధుల భారినపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరికలు జారీ చేసింది.. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు ప్రజల్లో మరింత శారీరక శ్రమను ప్రోత్సహించడానికి తక్షణ చర్యలకు ఉపక్రమించాలని.. లేకపోతే ఏడాదికి 27 బిలియన్ డాలర్లు వ్యయం అవుతుందని పేర్కొంది.. అన్ని వయసులు, సామర్థ్యాలలో శారీరక శ్రమను పెంచడానికి ప్రభుత్వాలు ఎంత మేరకు సిఫార్సులను అమలు చేస్తున్నాయో అనేది ఈ సర్వే పేర్కొంది.
Read Also: Diwali Special: దీపావళి ఎలా వచ్చింది..? ఏమిటా కథ..?
బద్ధకాన్ని పారద్రోలేందుకు కొన్ని సూచలను చేసింది ఆ నివేదిక.. మొత్తం 194 దేశాల నుంచి వచ్చిన డేటా ప్రకారం పురోగతి నెమ్మదిగా ఉందని, శారీరక శ్రమ స్థాయిలను పెంచడానికి, తద్వారా వ్యాధి నిరోధకశక్తిని పెంచడానికి.. ఇప్పటికే ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై దృష్టి కేంద్రీకరించి వాటిని అమలు చేసేందుకు ఆయా దేశాలు వెనువెంటనే చర్యలు తీసుకోవాలని నివేదిక వెల్లడించింది. 50 శాతంకంటే తక్కువ దేశాల్లో ప్రజల శారీరక శ్రమ విధానాన్ని కలిగి ఉన్నాయని, అందులో 40శాతం కంటే తక్కువ దేశాలు పనిచేస్తున్నాయని నివేదిక తెలిపింది. 30 శాతం దేశాలు మాత్రమే అన్ని వయసుల వారికి జాతీయ శారీరక శ్రమ మార్గదర్శకాలను అందిస్తున్నాయని పేర్కొంది.. నడక, సైకిల్ తొక్కడం, క్రీడలు, ఇతర శారీరక శ్రమల ద్వారా ప్రజలు మరింత చురుగ్గా ఉండేలా కృషి చేయాలని నివేదించింది..
ఆ నివేదిక ప్రకారం భారత్లో బద్ధకస్తుల సంఖ్య పెరిగిపోయింది.. శారీరక శ్రమకు దూరంగా ఉండడంతో పలు దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.. భారత్లో 11-17 మధ్య వయస్సు వారిలో 74శాతం మంది అసలు శారీరక శ్రమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.. అందులో బాలురు 72శాతం, బాలికలు 76శాతంగా ఉండగా.. ఇక, 18ఏళ్లు పైబడినవారిలో మహిళలు 44శాతం, పురుషులు 25శాతం వ్యాయామం చేయడం లేదని పేర్కొంది.. మరోవైపు.. 70 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 60శాతం, పురుషులు 38శాతం శారీరక శ్రమ చేయడం లేదని.. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు… వీటిని నయం చేసుకునేందుకు క్రమంగా ఖర్చు పెరిగిపోతోంది.. దేశంలోనే ఏడాదికి రూ.25,600 కోట్లు ఖర్చు అవుతోందని.. అంతేకాదు.. వచ్చే పదేళ్లలో అది రెండు లక్షలకోట్లకు పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.. ఇదే సమయంలో.. దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడకుండా ఉండేలాంటే కొన్ని కీలక సూచనలు చేసింది.. మానసిక రోగాల కేసుల్లో 43శాతం మేర వ్యాయామం లేకపోవటమే కారణంగా తేలిందని.. నడకకు అనువైన రహదారుల వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉందని తెలిపింది.. వాహనాల వేగంపై నియంత్రణ పెంచడం.., డ్రంక్ అండ్ డ్రైవ్ నిరోధించడం.. మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడం నియంత్రించాలని.. ఇక, శారీరక శ్రమ చేయాలని ప్రోత్సహించే వ్యవస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచే ఉండాలని.. ప్రతీ ఒక్కరికీ వారానికి 300 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి అని ఆ నివేదిక స్పష్టం చేసింది.. 18ఏళ్లు పైబడిన వారు వారానికి 150 నుంచి 300 మధ్యస్థ శారీరక శ్రమ చేయాలని.. 11-17మధ్య వయస్సున్న పిల్లలు రోజుకు గంట శారీరక శ్రమ చేయాలని.. 18ఏళ్లు పైబడిన వారు కనీసం వారానికి రెండుసార్లు కండరాలు బలపడే వ్యాయామాలు చేస్తుండాలని.. 50 ఏళ్లు పైబడిన వారు వారానికి మూడు సార్లు బ్యాలెన్స్ ఎక్సర్ సైజ్ లు చేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన ఫిజికల్ యాక్టివిటీపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2022 నివేదిక స్పష్టం చేసింది.. ఇంకా ఎందుకు ఆలస్యం.. బద్ధకాన్ని వీడుదాం.. రోగాలబారినపడకుండా.. మనల్ని మనమే కాపాడుకుందాం..