ప్రస్తుతం దేశంలో మినీ ఎన్నికల సమరం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల్లో హోరా-హోరీగా ఎన్నికల పోరాటం జరుగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మిగతా నాలుగు రాష్ట్రాలు ఒకెత్తు అయితే పశ్చిమ బెంగాల్ మాత్రం మరోకెత్తు అని చెప్పక తప్పదు. బీజేపీ అధిష్టానం పశ్చిమ బెంగాల్ను చాలా సీరియస్గా తీసుకుంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రతి వ్యూహం రచిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో సంచలన సర్వే రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది?.. బెంగాల్ పీఠాన్ని ఎవరి దక్కించుకోబోతున్నారో సర్వే తేల్చేసింది.
వోట్వైబ్ సర్వే సంస్థ ఎన్నికల ముందు జరిపిన సర్వే ప్రకారం.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పశ్చిమ బెంగాల్లో మరోసారి అధికారం చేపట్టనుందని తేల్చి చెప్పింది. 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 184 నుంచి 194 సీట్లను గెలుచుకోవచ్చు అని అంచనా వేసింది. ఇక 2021 నాటి సత్తాను కొనసాగిస్తూ బీజేపీ 98-108 సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉందని.. కానీ మమత ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అవసరమైన సంఖ్యను మాత్రం సాధించలేదని స్పష్టం చేసింది.
ఇక తదుపరి ముఖ్యమంత్రిగా ర్యాంకింగ్లో మమతా బెనర్జీ 48.5 శాతం మద్దతుతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో బీజేపీకి చెందిన సువెందు అధికారి 33.4 శాతం మద్దతుతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అధిర్ రంజన్ చౌదరి, మహమ్మద్ సలీం (సీపీఎం) వరుసగా 3.7 శాతం, 4.3 శాతం మద్దతుతో చాలా వెనుకబడి ఉన్నారు. 65.5 శాతం మంది మద్దతుతో ముస్లిం సమాజం మమతకు బలమైన ఓటు బ్యాంకుగా ఉండగా.. షెడ్యూల్డ్ తెగలు (53.4 శాతం), అగ్రవర్ణ హిందువులు (43.7 శాతం) సువెందు అధికారి వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక మమతకు పురుషులు 47.6 శాతం, మహిళా ఓటర్లు 49.4 శాతం మద్దతు ఇస్తున్నారు. పురుషుల కంటే మహిళలే కొంచెం ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. ఇక మమతపై 37.2 శాతం మంది నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ సహా ఇతర పార్టీలు 1–3 సీట్లు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది.
సర్వే ప్రకారం.. 2024 లోక్సభ ఎన్నికల ట్రెండ్ను కొనసాగిస్తూ తృణమూల్ 41.9 శాతం ఓట్లను, బీజేపీ 34.9 శాతం ఓట్లను దక్కించుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని వారి శాతం 13 శాతంగా ఉంది. ఇది ఒక కీలకమైన హెచ్చుతగ్గులుగా సూచిస్తుంది. ఇక వర్గాల వారీగా చూస్తే.. ముస్లింలలో తృణమూల్కు (57.6 శాతం), ఎస్టీల్లో బీజేపీకి (51 శాతం) బలమైన మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మతువా వర్గంతో సహా ఎస్సీ/దళిత ఓటర్లు చీలిపోయారు. వీరిలో 43 శాతం మంది బీజేపీకి, 39.5 శాతం మంది తృణమూల్కు మద్దతు ఇస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి కేవలం 7.7 శాతం ఓట్లను మాత్రమే పొందుతున్నాయి.
ఇక సస్పెండ్ అయిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ఎన్నికల బరిలోకి దిగడంతో తృణమూల్ ముస్లిం ఓట్ల వాటా తగ్గే అవకాశం ఉందని 40.7 శాతం మంది ప్రతివాదులు భావిస్తున్నారు. మరోవైపు ఆయనకు బీజేపీ మద్దతు ఉందని 24.6 శాతం మంది నమ్ముతున్నారు. ఈ నిర్ణయం వెనుక తృణమూల్ ఉందని కేవలం 4.5 శాతం మంది మాత్రమే భావిస్తున్నారు.
ప్రభుత్వ పనితీరు
గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అంచనా వేయమని అడిగినప్పుడు.. ప్రతిస్పందించిన వారిలో 43.3 శాతం మంది “చాలా మంచిది”, “మంచిది” అని అంచనా వేయగా.. 38.9 శాతం మంది “బాగోలేదు”, “అసలు బాగోలేదు” అని చెప్పారు. దీనిని బట్టి మమతపై అసంతృప్తి కొనసాగుతోందని అర్థమవుతోంది.
బీజేపీ సవాళ్లు
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 19.9 శాతం మంది ప్రకారం.. అతిపెద్ద సమస్య అంతర్గత కలహాలు, వర్గపోరాటాలు ప్రధాన సమస్యగా తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవడం (17.2 శాతం) ఉంది ఒక కారణంగా చెప్పారు. టీఎంసీ ప్రచారం ప్రకారం.. ‘‘బయటి వ్యక్తి’’ అనే వాదన హైలెట్ చేస్తోంది. పార్టీకి బెంగాల్ సంస్కృతిపై అవగాహన లేదని సుమారు 12.5 శాతంమంది భావిస్తున్నారు. బలహీనమైన సంస్థాగత నిర్మాణం (10.1 శాతం), ప్రజలను ప్రభావితం చేసే సందేశం లేకపోవడం (12.3 శాతం) వంటివి పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక 22.5 శాతం మంది తాము ‘‘చెప్పలేమని’’ అన్నారు. దీనిని బట్టి గణనీయమైన సంఖ్యలో ప్రజలు బీజేపీ రాజకీయాలను నిశితంగా అనుసరించడం లేదని.. పార్టీని విమర్శించడానికి సంకోచిస్తున్నారని తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.