Vijay DMK Attack: తమిళనాడు సీఎం విజయ్, అసెంబ్లీలో డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతి చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రతిపక్ష డీఎంకేతో పాటు మాజీ సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లను టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు. డీఎంకే ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్ల నుంచి ‘పార్టీ ఫండ్’ పేరుతో కాంట్రాక్ట్ మొత్తంలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు లంచంగా వసూలు చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పత్రాలను ఉటంకిస్తూ ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా, రుణాలకు EMIలు చెల్లించినట్టుగా విడతల వారీగా వసూలు చేశారని విజయ్ ఆరోపించారు.
ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై (MAWS) శాఖ పరిధిలోని ప్రభుత్వ పనుల కాంట్రాక్టర్ల నుంచి పార్టీ ఫండ్ పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. తాను చేస్తున్నవి వ్యక్తిగత ఆరోపణలు కాదని స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లు అనుమానిత ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఈడీ పేర్కొన్న విషయాన్ని విజయ్ సభలో ఆరోపించారు.
టాస్మాక్ (TASMAC) వ్యవహారంలో ఈడీ ప్రస్తావించిన ‘‘కరూర్ గ్యాంగ్’’ అంశాన్ని కూడా విజయ్ లేవనెత్తారు. మాజీ ఎక్సైజ్ మంత్రి వి. సెంథిల్ బాలాజీ, ఆయన అనుచరులు కరూర్, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లోని బార్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఈడీ పత్రాలను ఉటంకిస్తూ విజయ్ ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు ఒక వ్యవస్థీకృత విధానంలో జరిగిందని, ఇది సైంటిఫిక్ కరప్షన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దశాబ్ధాల నాటి సర్కారియ కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ వీరాణం నీటి సరఫరా పథకానికి సంబంధించిన టెండర్లో 2.5 శాతం పార్టీ ఫండ్ డిమాండ్ చేశారన్న ఆరోపణల్ని సీఎం విజయ్ ప్రస్తావించారు. విజయ్ ఆరోపణల నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. విజయ్ అసలు సమస్యలపై సమాధానం ఇవ్వకుండా డైవర్షన్ కోసం పాత కేసులు, ఆరోపణల్ని ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.

