బ్యాంకులకు రుణాలు కట్టకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను వెనక్కి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తాము విజయ్ మాల్యా కోసం వేచిచూడలేమని స్పష్టం చేసింది. విజయ్ మాల్యా వచ్చినా.. రాకున్నా.. జనవరి 18న శిక్షను విధిస్తామని తేల్చి చెప్పింది.
Read Also: కొత్త బిజినెస్ ప్రారంభించిన ‘ఓలా’
విజయ్ మాల్యా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి విదేశాల్లో ఉన్న తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు విజయ్ మాల్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో 2017లోనే మాల్యాను దోషిగా నిర్ధారించింది. అయితే ఈ తీర్పును పున:సమీక్షించాలని మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై నాలుగేళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. కానీ మాల్యా మాత్రం విదేశాల నుంచి భారత్కు రావడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కేసులో ఇప్పటికే తాము చాలా సమయం వేచి చూశామని.. ఇక వేచి చూసేది లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.