UPI Charges: UPI చెల్లింపుల ఛార్జీల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రూ. 2000 దాటిన యూపీఐ మర్చంట్ లావాదేవీలపై రూ. 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 14న దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంజన్ దత్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 15 నుంచి అమలు కాబోతున్న ఎండీఆర్ ఫ్రేమ్ వర్క్ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.
కొత్త విధానాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఎండీఆర్ అమలుకు ముందు తగిన చట్టపరమైన ప్రక్రియ, పారదర్శకత, ప్రజలతో సంప్రదింపులు జరగలేదని, ప్రభుత్వం తగిన విధానం పాటించలేదని పిటిషనర్ ఆరోపించారు. పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్-2007లోని సెక్షన్ 10ఏ కింద తీసుకున్న చర్యల చట్టబద్ధతను కూడా పిటిషనర్ ప్రశ్నించారు.
అక్టోబర్ 15 నుంచి కొత్త ఎండీఆర్ విధానం..
వ్యక్తి నుంచి వ్యాపారికి (పర్సన్ టూ మర్చంట్)(P2M) లావాదేవీలపై ఎండీఆర్ అమలులోకి రాబోతోంది. రూ. 2,000 దాటిని వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తారు. సాధారణ వినియోగదారుడు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పడవని, ఇది వ్యాపారి చెల్లించే ఛార్జ్ అని కేంద్రం చెబుతోంది. వ్యక్తికి వ్యక్తి(పర్సన్ టూ పర్సన్) మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. రూ. 2000 లోపు ఉండే వ్యాపార చెల్లింపులపై కూడా ఎండీ ఆర్ ఉండదు. చిన్న వ్యాపారులు ప్రభావితంకారని కేంద్రం చెబుతోంది. నెలకు రూ. 1 లక్ష లోపు యూపీఐ ద్వారా స్వీకరించే వ్యాపారిపై కూడా ఈ ఎండీఆర్ ఛార్జీలు ఉండవని చెబుతోంది.

