Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాన్సర్ రోగులకు ఉపశమనం ప్రకటించారు. ముఖ్యమైన 17 రకాల క్యాన్సర్ ముందులపై ప్రాథమిక కస్టమ్ సుంకం మినహాయింపును ప్రకటించారు. దీంతో క్యాన్సర్ చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఇదే కాకుండా 7 అరుదైన వ్యాధులకు వాడే మందులకు కూడా సుంకాల మినహాయింపు ఇచ్చారు. ఈ వ్యాధులతో బాధపడే రోగులు ప్రత్యేక వైద్య ఆరోగ్య అవసరాల కోసం ఉపయోగించే ఆహారపదార్థాల, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులు,డ్రగ్స్పై కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ఖర్చుల్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అనేక క్యాన్సర్లకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులే ఉండటంతో ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. దీంతో 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకం తొలగింపు, ముఖ్యంగా ఆరోగ్య బీమా లేని రోగులకు ఉపయోగంగా మారుతుంది.