Modi-Trump: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడుల్ని ఆపడం లేదు, ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై అటాక్స్ చేస్తోంది. అయితే, యుద్ధం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచిన తర్వాత, మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేశారు. ‘‘హార్ముజ్ జలసంధి’’, ఇరాన్ యుద్ధంపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఇన్ని రోజుల తర్వాత ట్రంప్కు మోడీ ఎందుకు గుర్తుకు వచ్చారనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అయితే, ఇందులో పాకిస్తాన్ యాంగిల్ ఉందని తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్-యూఎస్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. త్వరలోనే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు కోపం రాకుండా అమెరికా జాగ్రత్త పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ను సంతృప్తి పరిచేందుకు ట్రంప్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్, మోడీ చర్చల్లో హార్ముజ్ భద్రత ప్రధానంగా ఉంది. ప్రపంచంలో సుమారుగా 20 శాతం చమురు, గ్యాస్ ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతోంది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారి తీస్తుంది. భారత్ వంటి పెద్ద దేశాలపై అధిక ప్రభావం ఉంటుంది.
మరోవైపు, భారత్ ఒక బ్యాలెన్సుడ్ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. ఒకేసారి అమెరికా-రష్యాలతో, ఇజ్రాయిల్-ఇరాన్తో మాట్లాడగలదు. గల్ఫ్ దేశాలతో భారత్కు సత్సంబంధాలు ఉన్నాయి. భారత్ ఏ ఒక్క పక్షానికి పూర్తిగా మద్దతు ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మధ్య చర్చలు జరిగాయి. అమెరికన్ అధికారులు భారత్ను ‘‘ముఖ్య భాగస్వామి’’గా అభివర్ణించడం గమనార్హం.
ఇక పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇరాన్తో పాక్కు సరిహద్దు సంబంధం ఉంది. ఇరాన్ తర్వాత షియాలు పాక్లోనే ఎక్కువగా ఉంటారు. ఇరాన్లో ఏం జరిగిన పాక్పై ప్రభావం ఉంటుంది. ఇక పాక్ ఆర్థిక సమస్యలు ఒకెత్తు. ఆయిల్ సంక్షోభం ఆ దేశాన్ని పట్టిపీడిస్తోంది. సౌదీ అరేబియాతో పాక్కు రక్షణ ఒప్పందం ఉంది. ఇరాన్ సౌదీపై దాడి చేస్తున్నా, పాక్ యుద్ధంలోకి దిగలేదు. ఒకవేళ ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగితే పాక్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ఈయుద్ధం త్వరగా ఆగాలని పాక్ భావిస్తోంది.
