ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన’ప్రళయ్’ క్షిపణిని బుధవారం ఒడిశా తీరంలో అబ్దుల్ కలామ్ దీవి నుండి డీఆర్డీఓ విజయవంతంగా ప్రయోగించింది. ”ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నేరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలోనే పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేశాయి.” అని డీఆర్డీఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్షిపణి 150-500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. క్వాసి మిస్సైల్ ట్రాజెక్టరీ కూడా బాలిస్టిక్ క్షిపణి పథంగానే వుంటుంది.
నిర్దిష్ట దూరం చేరుకున్న తర్వాత ఇది, అడ్డు వచ్చిన వాటిని దెబ్బతీయడానికి తన పంథాను మార్చుకుంటుందని రక్షణ అధికారులు వివరించారు. క్షిపణి తాకే పాయింట్కు సమీపంలో తూర్పు తీరం పొడవునా మోహరించిన సెన్సార్లు, దిగువున గల నౌకలు ఈ క్షిపణి మార్గాన్ని ట్రాక్ చేశాయని డీఆర్డీఓ తెలిపింది. సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్తో ఈ క్షిపణి పనిచేస్తుంది. మొబైల్ లాంచర్ నుండి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ క్షిపణి కొత్త తరం క్షిపణి అని డీఆర్డీఓ చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీవో, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.‘‘క్వాజీ బాలిస్టిక్ మిసైల్ను వేగంగా అభివృద్ధి చేసినందుకు నా అభినందనలు. ఇది కీలకమైన మైలురాయి’’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
