Tejaswi Yadav: బీహార్‌లో జేడీయూ శకం ముగిసింది.. నితీష్‌ను బీజేపీ హైజాక్ చేసిందన్న తేజస్వి యాదవ్

  • నితీష్ కుమార్‌ రాజ్యసభకు వెళ్లడంపై స్పందించిన తేజస్వి యాదవ్
  • బీహార్‌లో జేడీయూ శకం ముగిసింది
  • నితీష్‌ను బీజేపీ హైజాక్ చేసిందని వ్యాఖ్య
Tejaswiyadav

Tejaswiyadav

రాజ్యసభ ఎన్నికల వేళ బీహార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి. ఇంత సడన్‌గా నితీష్ కుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

తాజాగా ఇదే అంశంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఇక బీహార్‌లో జేడీయూ మనుగడ సాధించదని.. ఆ పార్టీ శకం ముగిసిందని ఆరోపించారు. నితీష్ కుమార్‌‌ను బీజేపీ హైజాక్ చేసిందని.. మిత్రులను తినేస్తోందని వ్యాఖ్యానించారు. ఓబీసీ లేదా అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. ప్రస్తుత పరిణామాలు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా ఉండనివ్వదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Heat waves: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు.. హడలెత్తిపోతున్న ప్రజలు

‘‘మహారాష్ట్రలో ఏం జరిగింది? తొలుత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత బీజేపీ హైజాక్ చేయలేదా? ఇప్పుడు బీహార్‌లో కూడా అదే జరిగింది. జేడీయూలోని కొంత మంది బీజేపీతో కుమ్మక్కయ్యారు. అందుకే ఇంత వేగంగా పరిణామాలు మారిపోయాయి.’’ అని తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చారు. ఇక నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై స్పందిస్తూ.. ‘‘ఇప్పటికే ఆలస్యమైందని.. చాలా సంవత్సరాల క్రితమే వచ్చి ఉండాల్సింది. కొంత మంది కావాలనే అతడిని అడ్డుకున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!