Site icon NTV Telugu

Bangladesh: భారత సంబంధాలపై తారిఖ్ రెహ్మన్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

Tarique Rahman

Tarique Rahman

Tarique Rahman: ‘‘బంగ్లాదేశ్ ఫస్ట్’’ అనే నినాదంలో ఆ దేశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, యూనస్ పరిపాలనతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, తారిఖ్ గెలుపు తర్వాత రెండు దేశాల సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, తాజాగా భారత సంబంధాల విషయంలో తారిఖ్ రెహ్మాన్ తొలిసారిగా స్పందించారు. బంగ్లాదేశ్ ఇంట్రెస్టుల ఆధారంగా భారత సంబంధాలు ఉంటాయని చెప్పారు. ‘‘బంగ్లాదేశ్, దాని ప్రజల ప్రయోజనాలు మన దేశ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయి’’ అని అన్నారు. భారత్, చైనా, పాక్ వంటి ప్రాంతీయ దేశాలతో సమతుల్య సంబంధాలు కొనసాగిస్తుందని, ఏ దేశాన్ని ‘‘మాస్టర్’’గా పరిగణించదని ఆయన గతంలో చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

Read Also: Adurs 2: చారి ఈజ్ బ్యాక్.. ‘అదుర్స్ 2’ స్క్రిప్ట్ రెడీ.. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?

300 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ 212 సీట్లను గెలుచుకుంది. రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీ రెండో స్థానంలో నిలిచింది. జమాత్‌తో పోలిస్తే బీఎన్పీ ఒకింత భారత్‌ విషయంలో ఊరట ఇచ్చే అంశం. ఉదారవాద, ప్రజాస్వామ్య భావాలు ఉన్న బీఎన్పీ గెలుపుతో రెండు దేశాల సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉంది. నిజానికి షేక్ హసీనా పాలనను భారత్-బంగ్లా సంబంధాలకు ‘‘స్వర్ణయుగం’’గా భావిస్తారు. ఇప్పుడు బీఎన్పీ భారత్‌కు దగ్గర కావడం ప్రారంభించింది.

యూనస్ పరిపాలనలో మతోన్మాద జమాత్ నాయకులు భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అక్కడ హిందువులపై జరిగిన దాడుల్లో వీరి ప్రమేయం ఎక్కువగా ఉంది. ఇక యూనస్ భారత వ్యతిరేకతను రెచ్చగొట్టాడు. పాకిస్తాన్‌, చైనాతో అంటకాగుతూ భారత్‌ను ఇరుకునపెట్టాలని చూశాడు. తాజాగా, బీఎన్పీ గెలుపు తర్వాత ప్రధాని నరేంద్రమోడీ, తారిఖ్ రెహ్మాన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోడీ ఫోన్ తర్వాత బీఎన్పీ పార్టీ థాంక్యూ చెబుతూ ట్వీట్ చేసింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.

Exit mobile version