Kallakurichi tragedy: ఇటీవల తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 60 మందికి పైగా మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే జిల్లాలో ఇంత మంది చనిపోవడంపై అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్పై బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడు మంత్రి దురైమురుగన్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టాస్మాకర్ మద్యంలో ‘‘కిక్’’ లేకపోవడం వల్లే ప్రజలు అక్రమ మద్యాన్ని తాగుతున్నారని అన్నారు. ప్రభుత్వం విక్రయించే మద్యాన్ని రోజూవారీ కూలీలు సాఫ్ట్ డ్రింక్స్తో పోల్చుతున్నారని అన్నారు.
Read Also: West Bengal: నడిరోడ్డుపై మహిళను కొట్టిన తృణమూల్ నేత.. మమతా బెనర్జీపై బీజేపీ ఫైర్..
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామి శనివారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రొహిబిషన్ యాక్ట్ను బలోపేతం చేసే బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దురైమురుగన్ వ్యాఖ్య చేశారు. ఈ బిల్లు ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయించే వారికి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు రూ. 10 లక్షల వరకు జరిమానాతో సహా కఠినమైన శిక్షలను అమలు చేస్తుంది. 65 మందిని బలిగొన్న కళ్లకురిచి ఘటన తర్వాత ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) ఎమ్మెల్యే జీకే మణి రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి ముత్తుస్వామి స్పందిస్తూ.. తమిళనాడులో పరిస్థితి సంపూర్ణ నిషేధాన్ని అమలు చేయడానికి అనుకూలంగా లేదని అన్నారు. మరో మంత్రి దురైమురుగన్ మాట్లాడుతూ కష్టపడే వారికి మద్యం అవసరమని చెప్పారు. హూచ్ దుర్ఘటనలో అధికార డీఎంకే అసమర్థతే మరణాలకు కారణమని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ ఆరోపించారు. దురైమురుగన్ వ్యాఖ్యలు తమ “అసమర్థ” నాయకుడైన ఎంకె స్టాలిన్ను రక్షించుకోవాలనే డీఎంకే తెగ ప్రయత్నిస్తోందని అన్నారు.