Chicken Biryani: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి మరింత పోషకాహారం అందించాలనే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన మిడ్డే మీల్ (మధ్యాహ్న భోజన) పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీని మెనూలో చేర్చే అవకాశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గుడ్లు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాలను ఇప్పటికే విద్యార్థులకు అందిస్తున్నారు. ఇప్పుడు చికెన్ బిర్యానీని కూడా మిడ్డే మీల్లో చేర్చితే పిల్లలకు అవసరమైన ప్రోటీన్లు, పోషకాలు మరింతగా అందుతాయని ప్రభుత్వం భావిస్తున్న తెలుస్తోంది.
ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు, రోజువారీ హాజరు శాతం పెరగడంతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమేనని, దీనిపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని సమాచారం. వ్యయభారం, అమలు విధానం, సరఫరా వ్యవస్థ వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఈ ప్రతిపాదన అమలైతే దేశవ్యాప్తంగా మిడ్డే మీల్ పథకంలో మరో వినూత్న అడుగుగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

