ఆఫ్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు.. చాలా దేశాలు ఈ పరిణామాన్నిజీర్ణించుకోలేకపోతున్నాయి.. మరికొన్ని దేశాలు.. వారితో స్నేహానికి తాము సిద్ధం అంటున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్కి చెందిన ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి.. సంభాల్ నియోజకర్గానికి చెందిన ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్… తాజాగా ఆఫ్ఘన్ పరిణామాలపై స్పందిస్తూ.. ఆఫ్ఘన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు.. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు సమానమేనంటూ సెలవిచ్చిన ఆయన.. తాలిబన్లది కూడా ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని చెప్పుకొచ్చారు..
ఇక, తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని వ్యాఖ్యానించిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్.. వారు అనుకున్నది సాధించారంటూ ఒక రకంగా అభినందించారు. అయినా అదంతా ఆ దేశ అంతర్గత వ్యవహారం అన్నారు. అయితే, సమాజ్వాదీ ఎంపీ వ్యాఖ్యలను తప్పుపట్టారు సీఎం యోగి… ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని మండిపడ్డారు.. తాలిబన్లను సమర్థించడం అంటే వారి రాక్షసకాండను సైతం సమర్థించినట్లే అవుతుందన్నారు.