NTV Telugu Site icon

Supreme Court: రేషన్ కార్డుల జాప్యంపై ధర్మాసనం తీవ్ర అసహనం.. ఓపిక నశించిందని వ్యాఖ్య

Supremecourt

Supremecourt

రేషన్ కార్డుల జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్నా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం రేషన్ కార్డులు జారీ చేయడం లేదు. దీంతో ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఓపిక నశించిందని ధ్వజమెత్తింది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం చంద్రబాబు

కరోనా సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని.. సర్వోన్నత న్యాయస్థానం 2020లో దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా.. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి. దీంతో న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఓపిక నశించిందని.. మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. లేదంటే మీ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ వ్యవహారంపై నవంబరు 19లోగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Harsha Sai Case : ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసమే బాధితురాలితో ప్రేమ, పెళ్లి అంటూ మోసం