ఓబీసీ రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుని.. ఐఏఎస్ వంటి కీలక పదవుల్లో ఉంటే.. వారి పిల్లలకు మళ్లీ రిజర్వేషన్ అవసరమా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్య, ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక స్థాయి కూడా పెరుగుతుందని.. అయినప్పటికీ తరతరాలుగా రిజర్వేషన్ కొనసాగితే దాని ఉద్దేశమే ఏమిటని వ్యాఖ్యానించింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఓ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కురుబా సమాజానికి చెందిన ఒక అభ్యర్థి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఓబీసీ రిజర్వేషన్ కింద ఎంపికయ్యాడు. అయితే అతని కుటుంబం ‘క్రీమీ లేయర్’ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ జిల్లా కుల, ఆదాయ ధృవీకరణ కమిటీ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరించింది. అభ్యర్థి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులని.. వారి వార్షిక ఆదాయం సుమారు రూ.19.48 లక్షలు ఉందని అధికారులు గుర్తించారు. దీంతో వారు క్రీమీ లేయర్లోకి వస్తారని కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించారు.
దీనిపై అభ్యర్థి కర్ణాటక హైకోర్టుకు వెళ్లాడు. అయితే అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల నుంచి మినహాయించడాన్ని న్యాయస్థానం కూడా సమర్థించింది. దీంతో బాధితుడు కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. “తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులైతే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? విద్య, ఆర్థిక సాధికారతతో సామాజిక అభివృద్ధి వస్తుంది. అలాంటప్పుడు మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ కోరితే మనం ఎప్పటికీ దాని నుంచి బయటకు రాలేం” అని వ్యాఖ్యానించారు. “రిజర్వేషన్ వల్ల తల్లిదండ్రులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించారు. మంచి ఆదాయం పొందుతున్నారు. ఇప్పుడు వారి పిల్లలు కూడా అదే రిజర్వేషన్ కోరుతున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం” అని పేర్కొన్నారు.
అయితే అభ్యర్థి తరపు న్యాయవాది శశాంక్ రత్నూ వాదిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో క్రీమీ లేయర్ నిర్ణయానికి జీతం ఒక్కటే ప్రమాణం కాదన్నారు. తల్లిదండ్రులు గ్రూప్-A లేదా గ్రూప్-B సేవల్లో ఉన్నారా అన్నదే ప్రధాన ప్రమాణమని తెలిపారు. కేవలం జీతాన్ని ప్రమాణంగా తీసుకుంటే డ్రైవర్లు, క్లర్కులు, ప్యూన్లు కూడా రిజర్వేషన్ కోల్పోతారని వాదించారు. జీతం, వ్యవసాయ ఆదాయాన్ని క్రీమీ లేయర్ లెక్కల్లో పరిగణించరాదని.. వ్యాపారాలు లేదా ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూడాలని పేర్కొన్నారు. లేదంటే ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మధ్య తేడా లేకుండా పోతుందని తెలిపారు. అయితే అభ్యర్థి తరపు న్యాయవాది వాదనలను ధర్మాసనం తీవ్రంగా తోసిపుచ్చింది. ఇది కరెక్టే కాదని పేర్కొంది.
కర్ణాటక హైకోర్టు తీర్పు..
ఈ కేసులో కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటికే అభ్యర్థిపై వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. కుటుంబ ఆదాయం పరిమితిని మించడంతో అభ్యర్థి క్రీమీ లేయర్లోకి వస్తాడని హైకోర్టు తేల్చింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా… రిజర్వేషన్ల ద్వారా లబ్ధిపొంది సామాజిక, ఆర్థిక సాధికారిత తర్వాత తమ కుటుంబంలోని తర్వాతి తరానికి అదే రిజర్వేషన్ పొందే విషయంలో ఎవరికి వారు పునః పరిశీలించుకోవాలని న్యాయస్థానం అభిప్రాయపడింది.
