Sonam Wangchuk: ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా ప్రజలలో ఒక చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే, ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ శనివారం తనను తాను ‘‘గౌరవ బొద్ధింక’’గా అభివర్ణించుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి తన మద్దతు ప్రకటించారు. ఇది యువతలో భావప్రకటనా స్వేచ్ఛను సూచిస్తుందని, అణిచివేయకుండా వారి అసంతృప్తిని వినాలని ప్రభుత్వాన్ని కోరారు.
నిరుద్యో్గం, పరీక్ష పత్రాల లీకులు, జవాబుదారీతనం వంటి సమస్యలపై యువతలో నెలకొన్న అసంతృప్తి ఈ ప్రచారం ఒక క్రియేటివిటీ, ప్రజస్వామ్య వ్యక్తీకరణ అని ఆయన అన్నారు. ఈ ఉద్యమానికి తాను ముగ్ధుడినయ్యానని అన్నారు. ఈ ఉద్యమంలో తాను చేరనని, ఇది నిరుద్యోగి, సోమరులకు సరిపోతాయని తనకు ఆ అర్హతలు లేవని వాంగ్చుక్ అన్నారు. నేను ఇందులో సభ్యుడిని కానని, కానీ ఒక గౌరవనీయ బొద్ధింక అని అభివర్ణించుకున్నారు.
ఈ ఉద్యమాన్ని రాజకీయ వ్యంగ్యంతో ఆయన పోల్చారు. ఈ ఉద్యమానికి అహింసా స్వభావం ఉందని, యువత ఘర్షణకు బదులుగా క్రియేటివిటీని ఎంచుకుందని చెప్పారు. ఇతర దేశాల్లో జరిగినట్లు వీధుల్లోకి రాళ్లతో కాకుండా, భారత యువత క్రియేటివిటీని మార్గంగా ఎంచుకోవడం తనను ఆకట్టుకుందని చెప్పారు. దీనిని గౌరవించడం, ప్రేమగా చూడటం భారత ప్రభుత్వం కర్తవ్యం అని అన్నారు.
మరోవైపు, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్లను క్లోజ్ చేయడం, హ్యాక్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఇలా యువత అసమ్మతిని మూసివేయడం మంచిది కాదని హెచ్చరించారు. నేపాల్లో ఇలాగే భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేయడం వల్లే ఊహించని పరిణామాలు సంభవించాయని అన్నారు. నేపాల్లో ఇంటర్నెట్ మూసేయడం, క్రియేటివిటీని అడ్డుకోవడంతోనే అల్లర్లు జరిగాయని ఆయన అన్నారు.
