Site icon NTV Telugu

Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పి.. కీలక కార్యదర్శిని తొలగించిన సిద్ధరామయ్య

Siddaramaiah

Siddaramaiah

కర్ణాటక కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఇంకా చల్లారినట్లుగా కనిపించడం లేదు. సిద్ధరామయ్య వర్సెస్ డీకే.శివకుమార్ మధ్య ఇప్పటికే కోల్డ్ వార్ నడుస్తోంది. పవర్ షేరింగ్‌పై ఇరు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. బైపోల్స్‌లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సిద్ధరామయ్య తన రాజకీయ కార్యదర్శి నజీర్ అహ్మద్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దావణగెరె సౌత్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం కలిగించేలా పలువురు పని చేసినట్లుగా హైకమాండ్‌కు నివేదిక అందింది. దీంతో అధిష్టానం సీరియస్ అయింది. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో రాజకీయ కార్యదర్శి నజీర్ అహ్మద్ ప్రమేయం ఉందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఇంటెలిజెన్స్ వింగ్, ఏఐసీసీ కార్యదర్శి అభిషేక్ దత్ రూపొందించిన రెండు వేర్వేరు నివేదికల్లో జబ్బార్, నజీర్ అహ్మద్, జమీర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు తేలింది. ప్రత్యర్థి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం, వారి ప్రచారానికి నిధులు సమకూర్చడం, ఎన్నికల్లో వారికి సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

నజీర్ అహ్మద్‌ను పదవి నుంచి తొలగించాలని శనివారం సిద్దరామయ్య, హైకమాండ్‌ల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. మొత్తానికి నజీర్ అహ్మద్‌ను రాజకీయ కార్యదర్శి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పించారు.

Exit mobile version