పింక్ సిటీగా పేరు తెచ్చుకున్న జైపూర్ నగరానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ నగరంలో 2008, మే 13 వ తేదీన ఉగ్రవాదులు వరస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. నగరంలో జరిగిన వరస బాంబు పేలుళ్లలో 71 మంది మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. జైపూర్ సిటీలో 15 నిమిషాల వ్యవధిలో 8 చోట్ల ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. సాయంత్రం సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడంతో మరణాలు అధికంగా సంభవించాయి. జైపూర్ లో రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకొని ఈ దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. మొత్తం 11 మంది ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారని ఏటీఎఫ్ పేర్కొంది. అందులో 10 మందిని అదుపులోకి తీసుకోగా ఒక వ్యక్తి ఇప్పటికి పరారీలోనే ఉన్నాడు.