భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మణిపూర్లో పర్యటించారు. శుక్రవారం ఇంఫాల్లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
చారిత్రక కాంగ్లా కోట సందర్శన
అంతకుముందు సెర్జియో గోర్ మణిపూర్లోని చారిత్రక కాంగ్లా కోటను సందర్శించారు. ఒకప్పుడు మణిపూర్ రాజ్యానికి రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా ఉన్న ఈ కోటకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. అలాగే మహిళలు నిర్వహించే ప్రముఖ మార్కెట్ ‘ఖ్వైరంబండ్ ఈమా కైథెల్’ను కూడా సందర్శించారు. మణిపూర్ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే క్రమంలో ఈ ప్రాంతాలను గోర్ సందర్శించినట్లు తెలుస్తోంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లోనే అమెరికా రాయబారి రాత్రి బస చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అంతకుముందు డార్జిలింగ్లో పర్యటన
మణిపూర్ పర్యటనకు ఒక రోజు ముందు సెర్జియో గోర్ పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో పర్యటించారు. రాజ్యసభ ఎంపీ, మాజీ విదేశాంగ కార్యదర్శి, అమెరికాలో భారత మాజీ రాయబారి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా వ్యక్తిగత ఆహ్వానం మేరకు డార్జిలింగ్ వెళ్లారు. డార్జిలింగ్ పర్యటనపై సెర్జియో గోర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. భారత్కు వచ్చిన తొలినాళ్లలో తనను ఆప్యాయంగా స్వాగతించిన వారిలో హర్ష్ వర్ధన్ శ్రింగ్లా ఒకరని తెలిపారు. తన స్వస్థలం, నియోజకవర్గమైన డార్జిలింగ్ను సందర్శించాలని శ్రింగ్లా ఆహ్వానించారని, ఆ అవకాశం ఇప్పుడు లభించిందని చెప్పారు. డార్జిలింగ్ ప్రజల ఆతిథ్యం, అక్కడి చరిత్ర, ప్రకృతి అందాలు, ఆహారం తనను ఆకట్టుకున్నాయని గోర్ పేర్కొన్నారు. భవిష్యత్లో మరోసారి డార్జిలింగ్కు వస్తానని తెలిపారు.
మకైబారి టీ ఎస్టేట్లో ప్రత్యేక అనుభవం
డార్జిలింగ్లోని ప్రసిద్ధ టీ తోటల్లో ఒకటైన చారిత్రక మకైబారి టీ ఎస్టేట్ను కూడా సెర్జియో గోర్ సందర్శించారు. అక్కడి పచ్చని తేయాకు తోటలను వీక్షిస్తూ, ప్రపంచ ప్రసిద్ధ డార్జిలింగ్ టీని ఆస్వాదించారు. భారత్లోని వివిధ ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే తన పర్యటనలో భాగంగానే డార్జిలింగ్, మణిపూర్లను గోర్ సందర్శించినట్లు తెలుస్తోంది.

