Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు

  • అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి
  • మా ఎంబసీ ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానం సాధించింది
  • సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
Sergio Gor

Sergio Gor

అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో సెర్జియో గోర్ మాట్లాడారు. ముఖ్యంగా ఔషధ తయారీ, మాన్యుఫాక్చరింగ్, టెక్నాలజీ రంగాల్లో భారత కంపెనీలు అమెరికాలో తమ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా కంపెనీలు కూడా భారతదేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో తమ పెట్టుబడులను పెంచుతున్నాయని వెల్లడించారు.

‘‘అమెరికాలో నిర్వహించిన వార్షిక సెలెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భారత కంపెనీలు 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉండటం చూసి నాకు ఎంతో ఆనందంగా అనిపించింది’’ అని చెప్పారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు అమెరికాకు పెట్టుబడులను తీసుకురావడానికి పోటీ పడుతుంటాయని.. అలాంటి పరిస్థితిలో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడం గొప్ప విజయమని పేర్కొన్నారు. ‘‘భారత్‌లోని మా భాగస్వాములతో కలిసి పనిచేసిన మా ఎంబసీ ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానం సాధించింది. ఇది నిజంగా అద్భుతమైన విజయమే’’ అని సెర్జియో గోర్ వ్యాఖ్యానించారు.

భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యం, పెట్టుబడుల విస్తరణ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.