Site icon NTV Telugu

Bihar Elections: మరికాసేపట్లో మలి విడత పోలింగ్ ప్రారంభం.. ‘‘సీమాంచల్’’ ఓటుపై పార్టీలు ప్రత్యేక దృష్టి

Bihar Elections 2025

Bihar Elections 2025

బీహర్‌లో మరికాసేపట్లో మలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇక తొలి విడతలో రికార్డ్ స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో కూడా అదే మాదిరిగా పోలింగ్ నమోదయ్యేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. రెండో విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.

మలి విడతలో ‘సీమాంచల్’ పోలింగ్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. సీమాంచల్ అనగానే ఆర్జేడీకి కంచుకోటలాంటిది. ఇక్కడ ఆర్జేడీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11, వామపక్షాలు 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా ఉన్నప్పుడు 80 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ కేవలం 36 స్థానాలకే పరిమితం అయింది. సీమాంచల్‌లో ఎక్కువుగా ముస్లింలు, యాదవ్‌లు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో మహాఘట్‌బంధన్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.

మలి విడతలో మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 1,302 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా… ఇందులో ప్రత్యేకగా 136 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం. 176 మందిని ఎన్నికల పరిశీలకులుగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అలాగే గట్టి పోలీస్ బందోబస్త్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీపావళి, ఛత్‌ పండుగ కోసం బీహారీయులంతా సొంత గ్రామాలకు రావడంతో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారే విజయాలపై అంచనాలు వేసుకుంటున్నాయి.

Exit mobile version