S-400 air defence system: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరొకటి భారత్కు రాబోతోంది. రష్యా నుంచి ఇప్పటికే మూడు ఎస్-400 ట్రయంప్ సిస్టమ్స్ భారత్కు రాగా, నాలుగో సిస్టమ్ ఇప్పుడు భారత వైమానిక దళం అందుకోబోతోంది. మే నెలాఖరు నాటికి ఇది భారత్ చేరుకుంటుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ దాడుల్ని ఎస్-400 సమర్థవంతంగా అడ్డుకుంది. ఇప్పుడు వస్తున్న నాలుగో స్వ్కాడ్రన్ను పాకిస్తాన్ సరిహద్దు వద్ద మోహరించనున్నారు. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం అవుతుంది.
2018లో ఎస్-400 కొనుగోలుపై రష్యాతో భారత్ రూ. 35,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రష్యా నుంచి భారత్కు 5 ఎస్-400లు రావాలి. ఇప్పటికే, వచ్చిన మూడు ఎస్-400 సిస్టమ్లను భారత్ సరిహద్దుల్లో మోహరించింది. ఇప్పుడు నాలుగోది వచ్చే నెలాఖరు వరకు భారత్ చేరుకుంటుంది. ఐదోది 2026 చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు అందిన మూడు సిస్టమ్స్లో ఒకటి భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను కలిపే సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్) వద్ద మోహరించగా, రెండోది జమ్మూ కాశ్మీర్, పంజాబ్లకు రక్షణ కల్పించే పఠాన్ కోట్లో, మూడోది రాజస్థాన్, గుజరాత్ లోని కీలక ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పుడు వచ్చే నాలుగవది పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరిస్తున్నారు.
