NTV Telugu Site icon

Bengal Re-Polling: బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో రీ – పోలింగ్‌.. 697 కేంద్రాల్లో నేడు నిర్వహణ

Bengal

Bengal

Bengal Re-Polling: ఎన్నికలు జరిగిన తరువాత ఒకటి, రెండు రోజుల్లో కొన్ని చోట్ల రీపోలింగ్‌ జరగడం సర్వసాధారణం. అలాగే పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో భారీ హింస చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లోని 697 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నేడు ఉదయం 7 గంటల నుంచి రీపోలింగ్‌ను నిర్వహించనున్నారు. పశ్చిమబెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో శనివారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసింది. పోలింగ్‌ రోజున భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీ హింస జరిగింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు, బ్యాలెట్‌ పేపర్లు తగలబెట్టడాలు, దొంగ ఓట్లు, పోలింగ్‌ బాక్సులు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు జరిగాయి. ఇక పోలింగ్‌ రోజున జరిగిన హింసలో ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ పార్టీలకు చెందిన 15 మంది మరణించారు. అయితే అనధికారికంగా 18 మంది మృతిచెందినట్టు చెబుతున్నారు. హింసాత్మక ఘటనలు జరిగిన 19 జిల్లాల్లోని 697 పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రీ పోలింగ్‌ నిర్వహించనుంది. ఈ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.

Read also: UP: అత్త స్నోకింగ్ స్టైల్.. భార్య కిస్సింగ్ స్టైల్ చూసి బిత్తరపోయిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్

రీపోలింగ్‌లో అత్యధికంగా ముర్షిదాబాద్‌లోని 175 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించనుండగా, మాల్డాలో 110, నాడియాలో 89, కూచ్ బేహార్‌లో 53, ఉత్తర 24 పరగణాలులో 46, ఉత్తర దినాజ్‌పూర్‌లో 42, దక్షిణ 24 పరగణాలలో 36, పూర్వ మేదినీపూర్‌లో 31, హుగ్లీలో 29, దక్షిణ్ దినాజ్‌పూర్‌లో 18, జల్పాయ్‌గురిలో 14, బీర్భూమ్‌లో 14, పశ్చిమ మేదినీపూర్‌లో 10, బంకురా, హౌరాల్లో 8 చొప్పున, పశ్చిమ బర్ధమాన్‌లో 6, పురూలియాలో 4, పూర్వ బర్ధమాన్‌లో 3, అలీపుర్‌దువార్‌లోని ఒక పోలింగ్‌ కేంద్రంలో రీ పోలింగ్ జరుగనుంది. కొండప్రాంతాలైన డార్జిలింగ్, జార్గ్రామ్, కాలింపాంగ్ జిల్లాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో అక్కడ పోలింగ్‌ను నిర్వహించడం లేదు. ఎన్నికల ఫలితాలు జూలై 11న వెలువడనున్నాయి. తాజా ఘర్షణల నేపథ్యంలో ఫలితాలు 11న వెలువడినప్పటికీ మరో 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర భద్రత బలగాలను మోహరించాలని కోల్‌కతా హైకోర్టు ఈ నెల 6న ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20 వరకు కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్‌లో కొనసాగనున్నాయి.