Rajiv Gandhi Assassination convicts leaves jail: సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న నళిని శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు తమిళనాడు వేల్లూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు శ్రీహరన్, సంతన్, మురుగన్, రాబర్ట్ పాయస్, ఆర్పీ రవిచంద్రన్ విడుదలైన వారిలో ఉన్నారు. 31 ఏళ్ల పాటు నిందితులు జైలు శిక్ష అనుభవించారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పుతో వీరందరికి ఊరట లభించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
1991 రాజీవ్ గాంధీ హత్య తరువాత 31 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆరుగురు జీవిత ఖదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన మరుసటి రోజు వారందరిని అధికారులు శనివారం సాయంత్ర తమిళనాడు జైలు నుంచి విడుదల చేశారు. మే నెలలో ఏడుగురు దోషుల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ ను సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి విడుదల చేసింది. ఇదే ఉత్తర్వును కూడా మిగతా వారికి వర్తింపచేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. దోషులను విడుదల చేయాలని తమిళనాడు మంత్రి వర్గం 2018లో గవర్నర్ కు సిఫారసు చేసిందని..అందుకు గవర్నర్ కూడా కట్టుబడి ఉన్నారని పేర్కొంది.
Read Also: Mass layoffs: మెటా దారిలో మరో కంపెనీ.. ఉద్యోగులను తొలగించే పనిలో స్ట్రీమింగ్ దిగ్గజం..!
ఇప్పటికే పెరోల్ పై ఉన్న నళిని స్థానిక పోలీస్ స్టేషన్ ప్రతీ రోజూ తప్పనిసరిగా హాజరు అవుతుంది. అక్కడి నుంచి వెల్లూరు లోని మహిళా జైలుకు వెళ్లి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత మిగతా దోషులు విడుదల అవుతన్న సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడ నుంచి అందరు జైలు నుంచి విడుదల అయ్యారు. దోషుల్లో మురుగన్, శాంతన్ ఇద్దరూ శ్రీలంక జాతీయులు కావడంతో పోలీసులు ప్రత్యేక వాహనంలో వారిద్దరిని తిరుచిరాపల్లిలోని శరణార్థి శిబిరానికి తీసుకెళ్లారు. అయితే దోషుల్లో సంతన్ తన సొంతదేశం శ్రీలంక వెళ్లాలని అనుకుంటున్నాడు. మరోవైపు నళిని తమిళనాడులో ఉంటుందా..? లేక తన కుమార్తె ఉన్న లండన్ వెళ్తుందా అనేది ఇంకా తెలియరాలేదు.
ఇదిలా ఉంటే 32 ఏళ్లుగా తనకు మద్దతు ఇస్తున్న తమిళులకు నళిని థాంక్స్ చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. మిగతా విషయాల గురించి రేపు చెన్నైలో ప్రెస్ మీట్ లో మాట్లాడతా అని వెల్లడించారు. 1991 మే 21, ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు తమిళనాడులోని శ్రీపెరంబుదూరు రాజీవ్ గాంధీ వచ్చిన క్రమంలో తమిళ్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) వేర్పాటువాదులు ఆత్మాహుతిలో హత్య చేశారు.
