PM Modi: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతల అఘాయిత్యాలపై పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖలీ ప్రాంతం గత కొన్ని వారాలుగా అట్టుడుకుతోంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని అక్కడి మహిళలు, ప్రజలు ఆందోళనలు చేశారు. వీరికి బీజేపీ మద్దతు తెలిపింది. దాదాపుగా 55 రోజులుగా పరారీలో ఉన్న టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్ని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు, గవర్నర్ సీరియస్ కావడంతో ఆ రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా సందేశ్ఖలి లైంగిక వేధింపులపై స్పందించారు. ఈ విషయంలో రాజారామ్ మోహన్ రాయ్ ఆత్మ క్షోభిస్తోందని శుక్రవారం అన్నారు. హుగ్లీ జిల్లాలోని ఆరాంబాగ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ.. సందేశ్ఖలీ సోదరీమణులపై టీఎంసీ ఏం చేసిందో దేశం మొత్తం చూసిందని, ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందన్నారు. సందేశ్ఖలీలో ఒక టీఎంసీ నాయకుడు హద్దుల్ని దాడాడు, రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఇక్కడి మహిళల గౌరవం కోసం పోరాడారని చెప్పారు.
టీఎంసీ పార్టీ నిందితుడికి రక్షణ కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. సందేశ్ఖలీలో మహిళ బాధల కన్నా కొందరి ఓట్లు మాత్రమే మమతా బెనర్జీకి ముఖ్యమయ్యాయా..? అని ప్రధాని ప్రశ్నించారు. ఈ అంశంపై ఇండియా కూటమి నేతల మౌనాన్ని ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ ‘మా, మాతీ, మనుష్’ (తల్లి, భూమి మరియు ప్రజలు) నినాదాన్ని ప్రస్తావిస్తూ.. టీఎంసీ సందేశ్ఖలీ మహిళలకు ఏం చేసిందని అడిగారు.
Read Also: Live-in relationship: మరో “లివ్ ఇన్ పార్ట్నర్” హత్య.. ఈ సారి నిందితురాలు మహిళ..
షేక్ షాజహాన్పై తీవ్ర ఆరోపణలు రావడంతో టీఎంసీ పార్టీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. నిన్న షేక్ షాజహాన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందుంచారు. అతడిని బెయిల్ ఇచ్చేందుకు కలకత్తా హైకోర్టు నిరాకరించింది. అతనిపై తమకు ఎలాంటి సానూభూతి లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. 10 రోజుల పాటు అతడికి కస్టడీ విధించింది. రేషన్ బియ్యం కుంభకోణంలో ఇతడిపై ఈడీ విచారణకు వెళ్లిన క్రమంలో అధికారులపై ఇతని మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి మహిళలపై టీఎంసీ గుండాలు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇదే కాకుండా లోకల్ టీఎంసీ నేతలు భూములను కబ్జా చేయడంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షేక్ షాజహాన్పై ఏకంగా 43 కేసులు పెండింగ్లో ఉన్నాయి.