తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ముఖ చిత్రాలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి అలర్ట్ అయ్యాయి. అధికారం కోసం రెండు కూటమిలు ఆరాటపడుతున్నాయి. ఇంకోవైపు నటుడు, టీవీకే అధినేత విజయ్ కూడా అధికారం కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం ఏ కూటమిలో చేరలేదు. కానీ కొంతమంది నాయకులు విజయ్ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా నిలిచాయి.
విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేంద్రం అడ్డుకోవడం వల్లే విజయ్ సినిమా ఆగిపోయిందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ తమిళ సంస్కృతిపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తమిళ సంస్కృతిపై దాడి చేస్తోందని.. ఇది కచ్చితంగా తమిళ ప్రజల గొంతును అణిచివేయడమేనని పేర్కొన్నారు. అయినా ఈ విషయంలో కేంద్రం ఎప్పటికీ విజయం సాధించదని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్రం ఇంకా స్పందించలేదు.
జన నాయగన్ సినిమాలో రాజకీయ అంశాలు ఉండడంతో విడుదలకు ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా స్పష్టత లేకపోవడం ఊహాగానాలు.. విమర్శలకు ఆజ్యం పోసింది. తమిళనాడు ఎన్నికల సమయంలో సినిమా ఏదైనా ప్రభావం చూపిస్తుందన్న కారణంతోనే సినిమా విడుదలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
