Site icon NTV Telugu

Rahul Gandhi: భయంతో తప్పుడు భాష మాట్లాడారు.. అమిత్ షా ప్రసంగంపై రాహుల్ గాంధీ అభ్యంతరం

Rahulgandhi

Rahulgandhi

ఎన్నికల సంస్కరణలపై బుధవారం పార్లమెంట్‌లో వాడివేడి చర్చ జరిగింది. ఎన్నికల సంఘంతో అధికార పార్టీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వేర్వేరు సమయాల్లో ఓట్ల చోరీకి పాల్పడ్డారంటూ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Mexico: భారత్, చైనాపై మెక్సికో వాణిజ్య యుద్ధం.. 50 శాతం సుంకాలు పెంపు

అమిత్ షా ప్రసంగాన్ని గురువారం రాహుల్ గాంధీ తప్పుపట్టారు. పార్లమెంట్‌లో తాము చేసిన ఆరోపణలపై అమిత్ షా భయపడ్డారని.. అందుకే తప్పుడు భాషను ఉపయోగించారని ఆరోపించారు. అమిత్ షా మాట్లాడేటప్పుడు చేతులు వణికాయి. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని తెలిపారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా లైవ్‌లో అందరూ చూశారని చెప్పుకొచ్చారు. తాము సంధించిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పలేకపోయారన్నారు. అంతేకాకుండా ఎటువంటి రుజువులు కూడా చూపించలేదని తెలిపారు.

ఇదిలా ఉంటే పార్లమెంట్‌లో అమిత్ షా చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోడీ అభినందించారు. విపక్షాలు లేవనెత్తిన అబద్ధాలను తిప్పికొట్టారని ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్‌లో రాసుకొచ్చారు.

అమిత్ ప్రసంగం ఇదే..
స్వాతంత్ర్యం వచ్చాక ప్రధాని పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు 28 మంది మద్దతు తెల్పారని.. నెహ్రూకు కేవలం ఇద్దరు మాత్రమే సపోర్ట్ చేశారని.. తీరా చూస్తే నెహ్రూనే ప్రధాని అయ్యారని.. దీని బట్టి అప్పుడే తొలి ఓటు చోరీ జరిగిందంటూ ఏకీపారేశారు. ఇక ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె ఎన్నికను న్యాయస్థానం రద్దు చేస్తే.. తనకు తానుగా చట్టపరమైన రక్షణ కల్పించుకున్నది వాస్తవం కాదా?.. ఇది రెండో చోరీ అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. ఇక సోనియాగాంధీ అసలు భారతీయ పౌరురాలు కాకముందే ఓటర్‌గా నమోదు కావడం మూడో ఓటు చోరీ అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతూ కాంగ్రెస్ ప్రతీసారి ఈవీఎంలను ఆడిపోసుకుంటోందని అమిత్ షా ఎద్దేవా చేశారు.

 

Exit mobile version